Donald Trump: మరోసారి మస్క్ సాయం కోరిన డొనాల్డ్ ట్రంప్

వ్యోమగాములు సునీతా విలియమ్స్ , బుష్ విల్మోర్ వారం రోజుల మిషన్ కోసం వెళ్లి సాంకేతిక సమస్యల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అయితే, వారిని సురక్షితంగా తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చర్యలు చేపట్టారు. ఈ మేరకు స్పేస్ ఎక్స్ అధినేత, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ ను సాయం కోరారు.
అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు సహాయం చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను కోరినట్లు మస్క్ తాజాగా తెలిపారు. సాంకేతిక సమస్యల కారణంగా నెలలుగా ఐఎస్ఎస్లో చిక్కుకుపోయిన వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు గత బైడెన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టలేదని విమర్శించారు. బైడెన్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వ్యోమగాములు నెలలుగా ఐఎస్ఎస్లో చిక్కుకుపోవాల్సి వచ్చిందన్నారు. వారు అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఆ ఇద్దరు వ్యోమగాములను తిరిగి భూమికి తీసుకొచ్చేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నట్లు మస్క్ వెల్లడించారు. ఇందుకోసం ట్రంప్ స్పేస్ఎక్స్ సాయం కోరినట్లు చెప్పారు. అధ్యక్షుడి అభ్యర్థన మేరకు త్వరలో ఆ పని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు.
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్ గతేడాది జూన్లో బోయింగ్ స్టార్లైన్ స్పేస్షిప్లో ఐఎస్ఎస్కి వెళ్లారు. వారం రోజుల మిషన్ కోసం వెళ్లిన వ్యోమగాములు స్టార్లైర్లో సాంకేతిక లోపం కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. జూన్ 6న ఇద్దరూ వ్యోమగాములు ఐఎస్ఎస్లోకి వెళ్లగా.. అదే నెల 14న తిరిగి భూమిపైకి రావాలి. కానీ, స్టార్ లైనర్లో హీలియం లీకేజీ నేపథ్యంలో ప్రయాణం వాయిదా పడింది. ఇద్దరు వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకువచ్చేందుకు నాసా ఏర్పాట్లు చేసింది. ఇందు కోసం స్పేస్ ఎక్స్ తో కలిసి పనిచేస్తోంది. ఫిబ్రవరి 2025లో తిరిగి భూమికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వాళ్లు మరోనెల రోజుల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది. మార్చి లేదా ఏప్రిల్ తొలి వారంలో వారు తిరిగి భూమిపైకి చేరుకునే అవకాశాలున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com