Iran US tensions : తమ పోర్టుల భద్రతకు ముప్పు వస్తే గల్ఫ్లో ఏ పోర్టూ సురక్షితంగా ఉండదని ఇరాన్ హెచ్చరిక

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. ఇరాన్ ఓడరేవులపై అమెరికా నౌకా దిగ్బంధనం (నేవల్ బ్లాకేడ్) విధించడంతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా చర్యకు ప్రతిగా ఇరాన్ సైతం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. తమ పోర్టుల భద్రతకు ముప్పు వాటిల్లితే, పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలోని ఏ పోర్టూ సురక్షితంగా ఉండదని స్పష్టం చేసింది.
అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఈరోజు (ఏప్రిల్ 13) నుంచి ఇరాన్ పోర్టులకు వెళ్లే లేదా అక్కడి నుంచి వచ్చే అన్ని నౌకలను దిగ్బంధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ చర్యను ఇరాన్ "సముద్రపు దొంగతనం"గా అభివర్ణించింది. అమెరికాకు సముద్రపు దొంగలకు పెద్దగా తేడా లేదని విమర్శించింది. "గల్ఫ్లోని పోర్టుల భద్రత అందరికీ ఉండాలి లేదా ఎవరికీ ఉండదు. మా పోర్టులను లక్ష్యంగా చేసుకుంటే, ఈ ప్రాంతంలోని అన్ని పోర్టులూ ప్రమాదంలో పడతాయి" అని ఇరాన్ ఖతామ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్క్వార్టర్స్ తీవ్రంగా హెచ్చరించింది.
ఇటీవల పాకిస్థాన్లో అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దిగ్బంధనానికి ఆదేశాలు జారీ చేశారు. అయితే, హర్మూజ్ జలసంధి గుండా ఇతర దేశాల పోర్టులకు వెళ్లే నౌకలకు ఎలాంటి ఆటంకం ఉండదని CENTCOM స్పష్టం చేసింది. మరోవైపు, హర్మూజ్ జలసంధి తమ నియంత్రణలో ఉందని, తమ సైనిక నౌకల వద్దకు వస్తే తీవ్రంగా స్పందిస్తామని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హెచ్చరించింది.
ప్రపంచంలోని ఐదో వంతు చమురు రవాణా జరిగే హర్మూజ్ జలసంధిలో ఈ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ దిగ్బంధనం వల్ల ఇరాన్ చమురు ఎగుమతులు నిలిచిపోయి, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఈసారి మరింత భారీగా పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
