Pakistan: ఇమ్రాన్‌ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష

Pakistan: ఇమ్రాన్‌ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష
ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేసింది

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పాక్ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ పార్టీ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తోషాఖానా అవినీతి కేసులో ఆయనను దోషిగా తేలుస్తూ ఇస్లామాబాద్‌లోని జిల్లా, సెషన్స్‌ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేగాక, ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేసింది. శిక్షతో పాటు లక్ష పాకిస్థాన్‌ రూపాయల జరిమానా కూడా విధించింది. ఈ జరిమానా కట్టకపోతే ఇమ్రాన్‌ మరో ఆరు నెలల పాటు జైల్లో ఉండాల్సి వస్తుందని హెచ్చరించింది. మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన కోర్టు అరెస్టు వారెంట్‌ కూడా జారీ చేసింది. దీంతో క్షణాల వ్యవధిలోనే ఇమ్రాన్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. లాహోర్‌లోని తన నివాసం నుంచి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


ఇమ్రాన్‌ ఖాన్‌పై అనర్హత వేటు వేయడంతో ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఆయన పోటీ చేసేందుకు వీల్లేకుండా పోయింది. ఈ నెల 9న జాతీయ అసెంబ్లీని రద్దు చేయనున్నట్లు దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు. ఆ తర్వాత 90 రోజుల్లో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఇమ్రాన్‌పై అనర్హత వేటు పడటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, వచ్చే ఎన్నికల్లో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పోటీ చేస్తారని పీఎం షెహబాజ్‌ ఇప్పటికే ప్రకటించారు.

గతేడాది ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానం కారణంగా ఇమ్రాన్‌ ఖాన్‌ పదవీచ్యుతుడయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయన్ను కేసులు చుట్టుముట్టాయి. ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధాన మంత్రి పదవిలో ఉండగా.. విదేశీ పర్యటనల్లో ఆయనకు వచ్చిన బహుమతులను విక్రయించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు నమోదైంది. ఇమ్రాన్‌ తన హయాంలో దాదాపు 58 ఖరీదైన బహుమతులు అందుకున్నారు. వాస్తవానికి వీటిని తోషాఖానాలో జమ చేయాలి. అయితే, వాటిని సొంతం చేసుకోవాలనుకుంటే నిబంధనల ప్రకారం సగం ధరం చెల్లించి తీసుకోవాలి. కానీ, ఇందులో 38 లక్షల రొలెక్స్‌ గడియారాన్ని కేవలం 7 లక్షల 54 వేలు చెల్లించి సొంతం చేసుకొన్నారు. 15 లక్షల విలువ చేసే మరో రొలెక్స్‌ గడియారానికి 2 లక్షల 94 వేలు మాత్రమే చెల్లించారు. ఇవేగాక.. నగలు, ఇతరత్రా ఖరీదైన వస్తువులను ఆయన చాలా తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకున్నారనే ఆరోరపణలు ఉన్నాయి. మొత్తంగా 11.9 కోట్ల పాకిస్థాన్‌ రూపాయల విలువైన వస్తువులను ఆయన కేవలం 2.4 కోట్ల పాకిస్థానీ రూపాయలకే తీసుకున్నారని మాజీ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్ ఆరోపించారు. వాటిల్లో కొన్నింటిని దుబాయ్‌లో అమ్ముకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story