Oslo: నార్వే రాజధాని ఓస్లోలోని యూఎస్ ఎంబసీ వద్ద పేలుడు , ఉలిక్కిపడిన స్థానికులు

నార్వే రాజధాని ఓస్లోలో తీవ్ర కలకలం రేగింది. ఇక్కడి అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ఎంబసీ సిబ్బంది, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనతో నార్వే ప్రభుత్వం అప్రమత్తమైంది.
సమాచారం అందుకున్న వెంటనే భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ పేలుడులో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని నార్వే పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. అయితే, ఎంబసీ భవనం వెలుపల స్వల్పంగా నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా రాయబార కార్యాలయం చుట్టూ భారీగా బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.
ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికాను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగి ఉండవచ్చన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అయ్యుంటుందన్న అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. బాంబు నిర్వీర్యక దళం, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన కారణంగా ఓస్లోలోని పలు ప్రధాన రహదారులను తాత్కాలికంగా మూసివేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
