FBI Reward : అమెరికాలో భారతీయుడిపై 2 కోట్ల రివార్డు
తొమ్మిది సంవత్సరాల క్రితం భార్యను దారుణంగా హత్య చేసి పరారైన భద్రేశ్కుమార్ చేతన్భాయ్ పటేల్ అనే భారతీయుడిపై అమెరికా ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) భారీ రివార్డు ప్రకటించింది. భార్యను చంపిన కేసులో అతడి కోసం ముమ్మరంగా వెతుకుతోంది. ఇందులో భాగంగా ఆ వ్యక్తి ఆచూకీ తెలిపిన వారికి రూ.2కోట్లు రివార్డ్ ఇస్తామని అమెరికా దర్యాఫ్తు సంస్థ ఎఫ్ బీఐ ప్రకటించింది.
ఆ వ్యక్తి పేరు భద్రేశ్ కుమార్ చేతన్ బాయ్ పటేల్. గుజరాత్ రాష్ట్రానికి చెందిన పటేల్.. 2015, ఏప్రిల్ 12న అమెరికా మేరీల్యాండ్ లో తన భార్యను కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. ఆ తర్వాత పరారయ్యాడు. అప్పటి నుంచి ఈ క్రిమినల్ ఎన్ఆర్ఐ కోసం ఎఫ్ బీఐ గాలిస్తోంది. ఇంతవరకు అతడి ఆచూకీ తెలియలేదు. దీంతో పది మంది మోస్ట్ వాంటెడ్ క్రిమిల్స్ జాబితాలో పటేల్ ను చేర్చిన ఎఫ్ బీఐ.. తాజాగా అతడి తలపై రూ.2కోట్ల రివార్డ్ ప్రకటించింది.
మేరీల్యాండ్ లోని హనోవర్ లో డోనట్ షాపులో పటేల్ దంపతులు పని చేసేవారు. అప్పుడు పటేల్ వయసు 24ఏళ్లు. అతడి భార్య పాలక్ వయసు 21ఏళ్లు. షాపులో కస్టమర్ల ముందే పటేల్ తన భార్యను కిచెన్ లో ఉపయోగించే కత్తితో అత్యంత దారుణంగా పొడిచి చంపేశాడు. డంకిన్స్ డోనట్ స్టోర్ లో వారిద్దరూ నైట్ షిష్ట్ లో పని చేస్తున్నారు. ఆ సమయంలో ఈ దారుణం జరిగింది. హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. భార్యను చంపిన తర్వాత పటేల్ పారిపోయాడు. కోర్టు అతడికి 2015, ఏప్రిల్ 15న అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే, అప్పటి నుంచి అతడు దొరకలేదు. ఏళ్లు గడుస్తున్నా అతడి ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఈ క్రమంలో అమెరికా దర్యాఫ్తు సంస్థ ఎఫ్ బీఐ.. పటేల్ ఆచూకీ తెలిపిన వారికి రూ.2కోట్ల రివార్డ్ ఇస్తామని ప్రకటించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com