Pakistan Heavy Floods: పాకిస్థాన్‌లో భారీ వరదలు.. వందల మంది గల్లంతు..

Pakistan Heavy Floods: పాకిస్థాన్‌లో  భారీ వరదలు.. వందల మంది గల్లంతు..
X
నదిలో కొట్టుకుపోయిన 18 మంది కుటుంబ సభ్యులు

పాకిస్థాన్‌లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన ఒకే కుటుంబంపై వరద రూపంలో మృత్యువు విరుచుకుపడింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో సంభవించిన ఆకస్మిక వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది గల్లంతయ్యారు. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు ఏడుగురి మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు.

సమాచారం ప్రకారం, ఒక కుటుంబానికి చెందిన 18 మంది సభ్యులు విహారయాత్ర కోసం స్వాత్ లోయకు వచ్చారు. వారు స్వాత్ నది వద్ద ఉన్న సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. ఎగువ ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీనితో స్వాత్ నదికి ఒక్కసారిగా వరద నీరు భారీగా పోటెత్తింది. నది ఉగ్రరూపం దాల్చడంతో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగి, ఆకస్మిక వరద సంభవించింది. దీంతో నదిలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు వరద ఉద్ధృతికి నిలవలేక కొట్టుకుపోయారని అధికారులు భావిస్తున్నారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. మొత్తం 80 మంది సిబ్బందితో కూడిన ఐదు బృందాలు గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. నది పరివాహక ప్రాంతంలోని ఐదు వేర్వేరు ప్రదేశాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. ఇప్పటివరకు ఏడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోందని వారు పేర్కొన్నారు.

భారీ వర్షాల కారణంగా స్వాత్ జిల్లాలోని అనేక గ్రామాలు, పట్టణాలు నీట మునిగాయని, పదుల సంఖ్యలో ప్రజలు వరద నీటిలో చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయని వారు వెల్లడించారు.


Tags

Next Story