India-Germany: భారత నిపుణులకు జర్మనీ వీసాలు 90 వేలకు పెంపు

నైపుణ్య భారత శ్రామిక శక్తి పట్ల నమ్మకంతో వారికి జారీ చేసే వీసాల సంఖ్యను 20 వేల నుంచి 90 వేలకు పెంచాలని జర్మనీ నిర్ణయించిందని ప్రధాని మోదీ వెల్లడించారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. విదేశీ పెట్టుబడిదారులకు భారత్ తప్ప మరొక ఉత్తమమైన దేశం లేదని.. భారత్ వృద్ధి పథంలో భాగం కావడానికి ఇది సరైన సమయమని అన్నారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్లో భాగం కావాలని ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు. భారత్ రికార్డు స్థాయిలో రోడ్లు, నౌకాశ్రయాలపై పెట్టుబడులు పెడుతున్నదని, ఇండో-పసిఫిక్ ప్రాంతం ప్రపంచ భవిష్యత్తుకు చాలా ముఖ్యమని అన్నారు.
నైపుణ్యం కలిగిన భారత శ్రామిక శక్తి కోసం వీసాల సంఖ్యను పెంచేందుకు జర్మనీ నిర్ణయించింది. ఈ సంఖ్యను 20వేల నుంచి 90వేలకు పెంచిందని ప్రధాని మోదీ తాజాగా వెల్లడించారు. 18వ ఆసియా ఫసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్లో ప్రధాని మాట్లాడుతూ.. రాబోయే 25ఏళ్లకు వికసిత్ భారత్ కోసం రోడ్మ్యాప్ రూపొందించామని ఈ సందర్భంగా తెలిపారు. ‘‘ఫోకస్ ఆన్ ఇండియా పేరిట జర్మనీ క్యాబినెట్ ఒక పత్రాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. నైపుణ్యం కలిగిన భారతీయ ఉద్యోగులకు వీసాల సంఖ్యను 20 వేల నుంచి 90 వేలకు పెంచాలని జర్మనీ నిర్ణయించింది. భారత శ్రామిక శక్తిపై జర్మనీ ఉంచిన విశ్వాసం అద్భుతం. ఈ నిర్ణయం ఆ దేశ వృద్ధికి దోహదం చేస్తుంది. భారత్ తయారీ కేంద్రంగా మారింది’’ అని ప్రధాని మోదీ అన్నారు.
మూడురోజుల పర్యటనలో భాగంగా గురువారం జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ భారత్కు వచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో సమావేశం నిర్వహించుకుంటున్నామని వ్యాఖ్యానించారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థ అని కొనియాడారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com