Los Angeles: లాస్ ఏంజిల్స్లో హైటెన్షన్..

అమెరికాలోని అక్రమ వలసదారుల ఏరివేత నేపథ్యంలో ఫెడరల్ అధికారులు లాస్ ఏంజిల్స్ లో చేపట్టిన ఆకస్మిక తనిఖీలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో తాజాగా యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళనకారులను తీవ్రంగా హెచ్చరించారు. ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఒక పోస్టు పెట్టారు.. అందులో కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్, లాస్ ఏంజెలెస్ మేయర్ కరెన్ బాస్ తమ బాధ్యతలను నిర్వర్తించలేరనే.. విషయం అందరికీ తెలుసు అని రాసుకొచ్చారు. ఇక, ఫెడరల్ ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తుంది అని తేల్చి చెప్పారు. నిరసనకారులు, దోపిడీదారుల సమస్య వలే పరిష్కరిస్తామని ట్రంప్ వెల్లడించారు.
ఇక, లాస్ ఏంజెలెస్ ఘటనపై శ్వేత సౌధం డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇవి అమెరికా చట్టాలకు, సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారులను బహిష్కరిస్తుందని తేల్చి చెప్పారు. కాగా, లాస్ ఏంజిల్స్ లో రెండో రోజు కూడా ఆందోళనలు కొనసాగాయి. మరోవైపు, లాస్ ఏంజిల్స్ లో మొత్తం 44 మంది అక్రమ వలసదారులతో సహా తమను అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఫెడరల్ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. వందల మంది నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జి, టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com