Hindenburg: మూతపడనున్న హిండెన్‌బర్గ్ రీసెర్చ్..

Hindenburg: మూతపడనున్న హిండెన్‌బర్గ్ రీసెర్చ్..
X
సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్.

అమెరికా షార్ట్‌ సెల్లర్‌ కంపెనీ ‘హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌’ను మూసివేస్తున్నట్లు ఆ కంపెనీ ఫౌండర్‌ నాథన్‌ అండర్సన్‌ తెలిపారు. భారత పారిశ్రామికవేత్త అదానీ గ్రూప్‌పై కూడా గతంలో హిండెన్‌బర్గ్‌ సంచలన ఆరోపణలు చేసి కలకలం రేపిన విషయం తెలిసిందే.

తమ సంస్థను మూసేస్తున్నట్లు తెలుపుతూ నాథన్‌ అండర్సన్‌ ఓ లేఖ ద్వారా వెల్లడించారు. దీని గురించి గత ఏడాది చివరి నుంచి తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌, తమ టీమ్‌తో చర్చలు జరిపానని అన్నారు. ఆ తర్వాత తమ సంస్థను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

తాము ముందుగానే వేసుకున్న ప్రణాళికలు ముగియడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. తాము ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఎటువంటి బెదిరింపులుగానీ, ఆరోగ్య, వ్యక్తిగత కారణాలుగానీ లేవని స్పష్టం చేశారు.

సక్సెస్‌ సాధించిన కెరీర్‌ ఏదో ఒకప్పుడు స్వార్థపూరిత చర్యల దిశగా వెళ్తుందని తన ఒకరు చెప్ఆపరని అన్నారు. తనను తాను నిరూపించుకోవాలని అప్పట్లో భావించేవాడినని చెప్పారు. ప్రస్తుతం తాను కంఫర్ట్‌ జోన్‌లో ఉన్నట్లు తాను భావిస్తున్నట్లు తెలిపారు.

హిండెన్‌బర్గ్‌ సంస్థను స్థాపించడం తన జీవితంలో ఓ చాప్టర్‌ మాత్రమేనని చెప్పారు. తాము ఎన్నో చాలెంజ్‌లు ఎదుర్కొన్నప్పటికీ చురుకుగా పనిచేశామని తెలిపారు. ఇది అంతా తనకు ఓ లవ్‌ స్టోరీలా కనపడుతోందని అన్నారు. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ను ఆయన 2017లో స్థాపించారు. ఇక దాని ప్రస్థానం ముగుస్తోంది.

ఇకపోతే, గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ మోసానికి పాల్పడిందని ఆరోపిస్తూ.. జనవరి 2023లో 40 ఏళ్ల ఆండర్సన్ ఒక నివేదికను ప్రచురించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఆ సమయంలో గౌతమ్ అదానీ ప్రపంచంలోని నాల్గవ సంపన్న వ్యక్తిగా కొనసాగుతున్నాడు. ఈ విషయం పై గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక గ్రూప్‌ను అస్థిరపరచడమే కాకుండా రాజకీయంగా భారతదేశాన్ని పరువు తీసేలా ఉందని తెలిపారు.

Tags

Next Story