United State : భారత మ్యాప్‌పై వివాదాస్పద పోస్ట్‌ను తొలగించిన అమెరికా

United State :  భారత మ్యాప్‌పై వివాదాస్పద పోస్ట్‌ను తొలగించిన అమెరికా
X
వివరణ ఇవ్వకుండానే పోస్ట్‌ను డిలీట్

భారత్‌కు సంబంధించిన ఓ వివాదాస్పద సోషల్ మీడియా పోస్ట్‌ను యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) కార్యాలయం తన అధికారిక ఎక్స్ ఖాతా నుంచి తొలగించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), అక్సాయి చిన్‌లను భారత్‌లో అంతర్భాగంగా చూపుతూ ప్రచురించిన మ్యాప్‌తో కూడిన ఈ పోస్ట్ తీవ్ర చర్చనీయాంశం కావడంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.

గత వారం, భారత్-అమెరికా మధ్య కుదిరిన ఓ తాత్కాలిక వాణిజ్య ఒప్పందం గురించి ప్రకటిస్తూ యూఎస్టీఆర్ ఈ పోస్ట్ చేసింది. అయితే, ఈ ప్రకటనకు జత చేసిన మ్యాప్‌లో పూర్తి జమ్మూకశ్మీర్‌ను (పీవోకే, అక్సాయి చిన్‌లతో సహా) భారత్‌లో చూపించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. సాధారణంగా వివాదాస్పద ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించే అమెరికా ప్రభుత్వ వైఖరికి ఇది భిన్నంగా ఉండటంతో, దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

ఇది పొరపాటున జరిగిందా? లేక కశ్మీర్‌పై అమెరికా విధానంలో మార్పు వచ్చిందా? అనే దానిపై తీవ్రమైన ఊహాగానాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో, ఎటువంటి అధికారిక ప్రకటన చేయకుండా యూఎస్టీఆర్ సైలెంట్‌గా ఆ పోస్ట్‌ను తమ ఖాతా నుంచి తొలగించింది. పీవోకే, అక్సాయి చిన్‌ సహా పూర్తి జమ్మూకశ్మీర్, లడఖ్ తమ అంతర్భాగమని భారత్ ఎప్పటినుంచో స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ పోస్ట్ తొలగింపుపై యూఎస్టీఆర్ కార్యాలయం ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

Tags

Next Story