INDIA: సౌర రంగంలో అమెరికా వెనక్కి... భారత్ ముందుకు

ప్రపంచ రాజకీయ యవనికపై అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం విషయంలో భారత్ కీలక పాత్ర పోషిస్తున్న వేళ, డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 120కి పైగా దేశాలతో కూడిన 'ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్' (ISA) నుంచి అమెరికా వైదొలగడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
భారత్ అమ్ములపొదిలో మరో అస్త్రం
ISA భారత ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో 2015లో ప్రారంభమైన అంతర్జాతీయ సోలార్ కూటమి (ISA), సౌర శక్తి రంగంలో విప్లవాత్మక మార్పులు లక్ష్యంగా ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం హర్యానాలోని గురుగ్రామ్లో ఉండటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా సౌర శక్తి వినియోగాన్ని పెంచడం, తక్కువ ధరకు సాంకేతికతను అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందించడం దీని ప్రధాన ఉద్దేశ్యం.అయితే, చారిత్రాత్మకంగా అంతర్జాతీయ సంస్థలకు అమెరికానే నాయకత్వం వహిస్తూ వస్తోంది. కానీ, ISAలో భారత్ అగ్రస్థానంలో ఉండి గ్లోబల్ సౌత్ దేశాలను ఏకం చేస్తుండటం వాషింగ్టన్లోని కొందరికి మింగుడుపడటం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణమేమిటి?
అమెరికా ప్రభుత్వం ఈ కూటమిని 'నిరుపయోగం' (Useless) అని పేర్కొంటూ తప్పుకుంది. దీని వెనుక రెండు ప్రధాన కోణాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై తానే 'పెద్దన్న'గా ఉండాలన్నది అమెరికా భావన. భారత్ నాయకత్వంలో పనిచేయడం వారికి నచ్చకపోవడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
వ్యాపార ప్రయోజనాలు
అమెరికా సొంత ఇంధన విధానాలు, ముఖ్యంగా శిలాజ ఇంధనాల (Fossil Fuels)పై ట్రంప్ మొగ్గు చూపడం సోలార్ కూటమికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం వర్సెస్ కార్పొరేట్ సంస్థలు ఇక్కడ గమనించాల్సిన మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. అమెరికా ప్రభుత్వం ISA నుంచి తప్పుకున్నప్పటికీ, ఆ దేశానికి చెందిన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ వంటి దిగ్గజ సంస్థలు భారతదేశంలో బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెడుతున్నాయి. ముఖ్యంగా డేటా సెంటర్ల నిర్వహణకు సౌర శక్తిని విరివిగా ఉపయోగిస్తున్నాయి. ప్రభుత్వం రాజకీయం చూస్తుంటే, కంపెనీలు మాత్రం భారత్లోని లాభాలను మరియు భవిష్యత్తును చూస్తున్నాయి.
భారత్పై ప్రభావం ఎంత?
అమెరికా నిష్క్రమణ ISAకు కొంత ఆర్థిక లోటును కలిగించవచ్చు కానీ, భారత్ యొక్క అంతర్జాతీయ పరపతిని ఇది తగ్గించలేదు. పైగా, యూరోపియన్ దేశాలు మరియు ఆఫ్రికా దేశాలు భారత్ నాయకత్వాన్ని బలపరుస్తున్నాయి. అమెరికా వైఖరి వల్ల గ్లోబల్ వార్మింగ్ను ఎదుర్కోవాలన్న ప్రపంచ లక్ష్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. పర్యావరణం అనేది ఒక దేశ సమస్య కాదు, ఇది మొత్తం ప్రపంచానికి సంబంధించిన అంశం. ఈ సమయంలో అమెరికా వంటి అగ్రరాజ్యం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి, 'ఈగో' కోసం ఇలాంటి కీలక కూటముల నుంచి తప్పుకోవడం విచారకరం. ఏది ఏమైనా, సౌర శక్తి రంగంలో భారత్ దూసుకుపోతున్న వేళ, అమెరికా వెనక్కి తగ్గడం ఆ దేశానికే నష్టమని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు అగ్రరాజ్యం అహంకారంతో దూరమైనా, ప్రపంచం మాత్రం భారత్ వైపు చూస్తోంది; ఎందుకంటే భవిష్యత్తు సూర్యకాంతిలో ఉంది, చీకటి రాజకీయాల్లో కాదు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

