India-Maldives Row: మోదీ ఎఫెక్ట్.. మాల్దీవులకు కోలుకోలేని ఎదురుదెబ్బ

భారత్పై అక్కసు వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపే పరిస్థితి వచ్చింది. భారత్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మాల్దీవుల ప్రభుత్వానికి తెలిసివస్తోంది. అన్ని వైపుల నుంచి బాయ్కాట్ మాల్దీవుల నినాదం మార్మోగిపోతోంది. ఇప్పటికే బాయ్కాట్ మాల్దీవులు హ్యాష్ ట్యాగ్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా మరోపక్క దేశీయ పర్యాటక సంస్థలు మాల్దీవులకు టికెట్లను రద్దు చేస్తున్నాయి. అక్కడి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినా అప్పటికే పరిస్థితి చేజారింది. మాల్దీవుల మంత్రుల నోటి దురుసుకు.ఇప్పుడు ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకుంటోంది.
ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. మాల్దీవుల మంత్రుల నోటి దురుసుకు ఇప్పుడు ఆ దేశ పర్యాటక రంగం కుదేలయ్యే పరిస్థితి తలెత్తింది. 2023లో మాల్దీవుల పర్యాటకుల జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉంది. గత ఏడాది రెండు లక్షల మందికిపైగా భారతీయులు మాల్దీవుల్లో పర్యటించి ఆ దేశ ఆర్ధిక వృద్ధిలో కీలకంగా వ్యవహరించారు. ప్రధాని మోదీ లక్షద్వీప్లో పర్యటించి ఇక్కడికి రావాలని పిలుపునివ్వడంపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కడంతో ఇప్పుడు ఆ దేశానికి వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దేశీయ సంస్థ ఈజ్ మై ట్రిప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేయాలని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టి ఎక్స్లో పోస్టు పెట్టారు. మాల్దీవుల విమాన బుకింగ్లన్నింటినీ ఈజ్మై ట్రిప్ సంస్థ నిలిపేసింది. ఓపక్క సెలబ్రెటీలు మరోపక్క నెటిజన్లు ఇంకోపక్క విమానయాన సంస్థలు... ఇలా అందరూ బాయ్కాట్ మాల్దీవులు అంటూ నినదిస్తుండడంతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారత్ తమ మిత్ర దేశం అంటూ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తోంది.
అన్ని వైపుల నుంచి బాయ్కాట్ మాల్దీవులు అంటూ భారత నెటిజన్లు పోస్టులతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. మాల్దీవుల పర్యాటకాన్ని రద్దు చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు. ఇప్పటికే వేలాది మంది భారతీయులు మాల్దీవుల పర్యటనను విరమించుకున్నారు. విమాన, హోటల్ బుకింగ్లను రద్దు చేశారు. మాల్దీవుల మంత్రుల నోటి దురుసును సెలబ్రిటీలు బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం, శ్రద్ధా కపూర్ తీవ్రంగా తప్పుబట్టారు. లక్షద్వీప్, అండమాన్ సుందరమైన ప్రదేశాలని..అమితాబ్ బచ్చన్ ఎక్స్లో ట్వీట్ చేశారు. తాను లక్షద్వీప్, అండమాన్లకు వెళ్ళానని.. అవి చాలా అద్భుతమైన ప్రదేశాలని అక్కడి జలాలు, బీచ్ల అందాలను చూస్తూ మైమరచి పోవచ్చని బిగ్ బి పేర్కొన్నారు. అమితాబ్తో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. వీరికి మద్దతుగా నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.
భారతీయుల బాయ్కాట్ నినాదంపై మాల్దీవుల మాజీ మంత్రి అహ్మద్ మహ్లూఫ్ స్పందించారు. భారత్పై చేసిన వ్యాఖ్యలతో జరుగుతున్న నష్టంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మాల్దీవుల పర్యటనలను భారతీయులు బహిష్కరిస్తే.. అది తమ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. భారత్పై వ్యాఖ్యలు తమకే నష్టమని. అందుకే ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తమ నేతలు చేసిన వ్యాఖ్యలు తమకే సిగ్గుచేటని ఇందుకు భారత్కు క్షమాపణలు తెలియజేస్తున్నానని మాల్దీవుల మాజీ మంత్రి అన్నారు. తమ దేశంపై జరుగుతోన్న బాయ్కాట్ ప్రచారాన్ని ముగించాలని నెటిజన్లను అబ్దుల్లా అభ్యర్థించారు.
మరోవైపు ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. మాల్దీవుల హై కమిషనర్ ఇబ్రహీం షహీబ్కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. దిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్కు వెళ్లిన ఇబ్రహీం షహీబ్ వివాదంపై భారత ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులపై మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసిన పరిణామాలను షహీబ్ వివరించారు. అయితే జరిగిన వివాదంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని భారత్ ఆయనకు స్పష్టం చేసింది. మరోవైపు ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలపై మాల్దీవుల విదేశాంగ శాఖ స్పందించింది. ఇవి సహింలేనివని మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ అన్నారు. మాల్దీవులు తన పొరుగు దేశాలతో సానుకూలంగా ఉంటుందనిప్రధాని మోదీపై మంత్రులు చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com