UN-India: టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించండి: ఐరాసలో భారత్

పహల్గాం ఉగ్ర దాడితో దేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ మారణహోమానికి తామే బాధ్యులమని లష్కరే తయ్యిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’(TRF) ప్రకటించుకున్నట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో దానిని ఉగ్రసంస్థగా ప్రకటించేలాఐరాసలో భారత్ కీలక చర్యలు ప్రారంభించింది. ఐరాస ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రసంస్థల జాబితాలో చేర్చేలా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం న్యూయార్క్లో ఉన్న మన ప్రతినిధుల బృందం.. ఆంక్షల పర్యవేక్షణ బృందం, యూఎన్లోని ఇతర భాగస్వామ్య దేశాలతో చర్చలు జరిపింది. అలాగే యూఎన్ ఆఫీస్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం, కౌంటర్ టెర్రరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్తో భేటీ అయింది.
ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది పాకిస్థాన్కు చెందిన లష్కర్ ఏ తయ్యిబాకు అనుబంధ సంస్థ. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉద్భవించిన కొత్త ఉగ్రవాద సంస్థ ఇది. 2019 అక్టోబర్లో ఏర్పాటైన ఈ సంస్థకు ఉగ్రవాది షేక్ సాజిద్ గుల్ సుప్రీం కమాండర్గా, చీఫ్ ఆపరేషనల్ కమాండర్గా బాసిత్ అహ్మద్ దార్ వ్యవహరిస్తున్నారు. హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే సభ్యులతో తొలుత టీఆర్ఎఫ్ ఏర్పడింది.
జమ్మూకశ్మీర్లో లష్కరే ఉగ్రముఠాకు అనుబంధంగా ఉన్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’(TRF)ను కేంద్ర హోంశాఖ గతంలోనే ఉగ్రసంస్థగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి జనవరి 6, 2023న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉగ్ర కార్యకలాపాల కోసం ఆన్లైన్ ద్వారా యువతను నియమించుకుంటోందని.. ఆయుధ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి చర్యలకు పాల్పడుతోందని తెలిపింది. జమ్మూ-కశ్మీర్ ప్రజలు భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదంలో చేరేలా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభావితం చేస్తోందని, ప్రజలు, భద్రతా దళ సభ్యుల హత్యలకు కుట్రలు పన్నుతోందని పేర్కొంది.
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గాంకు దగ్గర్లో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం బైసరన్ లోయలో ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడిన సంగతి తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చినవారు పర్యాటకులను అతి సమీపం నుంచి కాల్చి చంపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com