San Francisco: భారత కాన్సులేట్‌పై మళ్లీ దాడి

San Francisco: భారత కాన్సులేట్‌పై మళ్లీ దాడి
శాన్‌ఫ్రాన్సిస్కోలో మరోసారి రెచ్చిపోయిన ఖలీస్థానీ మద్దతుదారులు... భారత రాయభార కార్యాలయానికి నిప్పు... తీవ్రంగా ఖండించిన అమెరికా

ఖలీస్థానీ మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయారు. అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయభార కార్యాలయంపై మరోసారి దాడి చేసి నిప్పంటించారు. అయిదు నెలల వ్యవధిలో ఇండియన్ కాన్సులేట్‌పై రెండోసారి దాడి చేయడం కలకలం రేపింది. తెల్లవారుజామున 1:30కు కార్యాలయానికి నిప్పుపెట్టినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని... అగ్నిమాపక విభాగం మంటలను అదుపులోకి తెచ్చిందని వెల్లడించింది. భారత రాయబార కార్యాలయంపై దాడిని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తీవ్రంగా ఖండించారు. అగ్రరాజ్యంలోని దౌత్య కార్యాలయాలను ధ్వంసం చేయడం క్రిమినల్‌ నేరమని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.


భారత కాన్సులేట్‌పై దాడికి పాల్పడిన వీడియోలు బయటకు వచ్చాయి. కాన్సులేట్ ప్రాంగణంలో రెండు ఖలిస్థాన్ బ్యానర్‌లను ఏర్పాటు చేశారు. ఖలిస్థాన్ అనుకూల నినాదాలు చేస్తూ నిరసనకారులు రాయబార కార్యాలయంలోకి దూసుకుపోయారు. అమెరికా దేశంలో దౌత్య కార్యాలయాలు, విదేశీ దౌత్యవేత్తలపై దాడి చేయడాన్ని హింసపూరిత నేరంగా పరిగణిస్తారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని యూఎస్ తెలిపింది.ఈ ఏడాది మార్చిలో ఖలిస్థాన్‌ సానుభూతిపరుడు, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ అరెస్టుకు భారత్‌లో ముమ్మర యత్నాలు చేస్తున్న సమయంలో ..

శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయంపై ఇదేవిధంగా దాడి జరిగింది. రక్షణ బారికేడ్లును ధ్వంసం చేసుకుంటూ రాయబార కార్యాలయం ప్రాంగణంలోకి దూసుకొచ్చిన ఖలిస్థానీ మద్దతుదారులు విధ్వంసం సృష్టించారు. తలుపులు, కిటికిలపై రాడ్లతో దాడి చేశారు. ఖలిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ, ఖలిస్తాన్‌ జెండాలను ప్రాంగణంలో ఎగురవేశారు. దౌత్య కార్యాలయంపై దాడి విషయంలో దిల్లీలోని అమెరికా దౌత్యాధికారికి మన దేశం అప్పట్లో తీవ్ర నిరసన తెలిపింది. బాధ్యులైన వారిపై వెంటనే అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ చర్యను తీవ్రమైనదిగా పరిగణించిన భారత విదేశాంగ శాఖ అక్కడకు నిరసనకారులు వచ్చేంతవరకూ భారత హైకమిషన్‌ భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఘటనపై సమగ్ర వివరణ ఇవ్వాలని కోరింది. శాన్‌ ఫ్రాన్సిస్కో, కెనడా, లండన్‌ దౌత్య కార్యాలయాలపై దుశ్చర్యలపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద దిల్లీ పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. అనంతరం ఈ కేసుల విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ తన చేతుల్లోకి తీసుకుంది. లండన్ ఘటనపై ఎన్‌ఐఏ ఇప్పటికే విచారణను కొనసాగిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story