Indonesia : నౌక మునిగి 15 మంది మృతి

ఇండోనేషియాలో సోమవారం సులవేసి ద్వీపంలోని ఓ పడవ మునిగిపోయింది. ఈ ప్రమాద ఘటనలో 15 మంది ప్రయాణికులు మరణించగా, మరో 19 మంది గల్లంతు అయ్యారు.
ఆగ్నేయ సులవేసి ప్రావిన్స్ రాజధానికి దక్షిణంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మునా ద్వీపంలోని ఒక బే గుండా ఈ నౌక ప్రయాణికులను తీసుకువెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటన జరిగినపుడు నౌకలో 40మంది ప్రయాణికులున్నారు. వారిలో 15 మంది చనిపోగా ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారని ఇండోనేషియా అధికారులు చెప్పారు. రాత్రి సమయంలో నౌక మునిగిపోవడానికి కారణాలు ఇంకా తెలియలేదు. అలాగే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడానికి కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే ప్రాణాలతో బయటపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ ప్రతినిధి ఒకరు చెప్పారు. లభించిన మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించారు.
17,000 కంటే ఎక్కువ ద్వీపాలతో కూడిన ఇండోనేషియాలో నౌకలపై ప్రయాణం సర్వ సాధారణం. నౌకల ప్రయాణాల్లో భద్రతా ప్రమాణాలకు తిలోదకాలు ఇవ్వడంతో ప్రయాణికుల ప్రాణాలను రక్షించే పరికరాలు లేకుండా ఓడలను ఓవర్లోడ్ చేస్తుంటారు.దీంతో తరచూ ఇండోనేషియాలో ప్రమాదాలు జరుగుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com