Ebrahim Raisi: ఇరాన్‌ అధ్యక్షుడి హెలికాప్టర్‌ ప్రమాదం.. బతికే అవకాశాలు తక్కువే

17గంటల తర్వాత దొరికిన హెలికాఫ్టర్ శిథిలాలు.

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించినట్లు ‘ఇరాన్‌ రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీ’ (IRCS) ప్రకటించింది. సోమవారం ఉదయం దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నుంచి కనిపెట్టినట్లు తెలిపింది. ఆ ప్రాంతంలో ఎవరూ బతికి ఉన్న ఆనవాళ్లు కనిపించడం లేదని అధికారులను ఉటంకిస్తూ ఆ దేశ ప్రభుత్వ వార్తాసంస్థ ఐఆర్ఎన్‌ఏ వెల్లడించింది. అంతకుముందు ప్రమాదస్థలానికి సంబంధించిన కచ్చితమైన భౌగోళిక కోఆర్డినేట్‌లను మానవరహిత విమాన (UAV) గాలింపులో కనుగొన్నట్లు తెలిపింది. ఆ ప్రాంతానికి IRCS దళాలు చేరుకున్నాయి. పలు ఇరాన్ మీడియా ఛానెల్‌లు రైసీ హెలికాప్టర్ శకలాలను రెస్క్యూ టీమ్‌లు కనుగొన్నాయని చెప్పాయి. అయితే, అధ్యక్షుడు, అతని సహచరులు ప్రాణాలతో బయటపడ్డారా లేదా అనే దానిపై రెడ్ క్రెసెంట్ సమాచారం అందించలేదు. మరో ఇరానీ మీడియా ప్రమాద స్థలంలో ఎవరూ సజీవంగా ఉన్నట్లు ఎటువంటి సంకేతాలు కనుగొనబడలేదని తేల్చింది.

‘తావిల్‌’ అనే ప్రాంతంలో హెలికాప్టర్‌ కూలిఉండొచ్చని తొలుత అనుమానించారు. ఆ ప్రాంతానికి సహాయక బృందాలను పంపారు. మరోవైపు తుర్కియేకు చెందిన ‘అకింజి’ అనే యూఏవీ.. కాలుతున్నట్లుగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించింది. ఈ సమాచారాన్ని ‘ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌’ (IRGC) కమాండర్‌ సైతం ధ్రువీకరించారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. అయినప్పటికీ.. రైసీ (Ebrahim Raisi) ఆచూకీ కోసం ప్రత్యేక దళాలు విశ్వప్రయత్నాలు చేశాయి. పొగ మంచు, వర్షం.. సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగించాయి. తూర్పు అజర్‌బైజాన్‌ రాష్ట్రంలోని వర్జాకాన్ నగరానికి సమీపంలో ఉన్న అడవుల్లో సైనిక బలగాలు ముమ్మర గాలింపు కొనసాగించాయి. మరోవైపు ఐఆర్‌సీఎస్‌ తమ 46 మెరుపు దళాలను రంగంలోకి దించినట్లు ప్రకటించింది. హెలికాప్టర్‌ కూలినట్లుగా అనుమానిస్తున్న ఓ ప్రదేశం సమీపానికి దాదాపు నాలుగు బృందాలు చేరినట్లు ఐఆర్‌సీఎస్‌ అధిపతి రజీహ్ అలిష్వాండి ఆదివారం రాత్రి వెల్లడించారు. కానీ, వాతావరణం సహకరించకపోవటంతో మరింత ముందుకు వెళ్లేందుకు తీవ్ర సవాళ్లు ఎదురైనట్లు తెలిపారు.

ప్రెసిడెంట్ రైసీతో హెలికాప్టర్‌లో .. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు హెలికాప్టర్‌లో విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్, తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మాలెక్ రహ్మతి, తబ్రిజ్ రాయల్ ఇమామ్ మొహమ్మద్ అలీ అల్హాషెమ్, ఒక పైలట్, సెక్యూరిటీ చీఫ్ , ఒక సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నారని ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ తెలిపింది.

Tags

Next Story