Iran Israel War: వణికిన ఇజ్రాయెల్.. ఏకకాలంలో హిజ్బుల్లా, హమాస్, హౌతీల దాడి

హమాస్ దాడికి ఏడాదైన సందర్భంగా ఎంత అప్రమత్తంగా ఉన్నా ఇజ్రాయెల్పై హిజ్బుల్లా, హమాస్ పెద్ద ఎత్తున రాకెట్లు ప్రయోగించాయి. హైఫా నగరంపై లెబనాన్నుంచి మొత్తం 135 రాకెట్లు వచ్చిపడ్డాయని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ దాడుల్లో పది మంది గాయపడ్డారు. ఏడాది క్రితం నాటి హమాస్ దాడిలో మరణించినవారికి నివాళులర్పిస్తున్న కార్యక్రమాలే లక్ష్యంగా హిజ్బుల్లా, హమాస్ ఈ రాకెట్ దాడులకు పాల్పడ్డాయి. టెల్ అవీవ్పై రాకెట్ దాడులు చేసినట్లు హమాస్ ప్రకటించింది. అటు యెమెన్ నుంచి హౌతీలు కూడా క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించారు. అయితే వాటిని తాము కూల్చివేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు లెబనాన్ రాజధాని బీరుట్లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తోంది.
గంట వ్యవధిలో 120 లక్ష్యాలపై దాడి చేశామని వెల్లడించింది. లెబనాన్లోని బరాచిత్ ప్రాంతంలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో పది మంది చనిపోయారు. వెస్ట్బ్యాంక్లో 400 మంది పాలస్తీనా మద్దతుదారులు ర్యాలీ నిర్వహించారు. ఇజ్రాయెల్ దాడుల్లో సెప్టెంబర్ 27న మరణించిన హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా ఫొటోలతో పాటు హిజ్బుల్లా, హమాస్, హౌతీల జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, ఏడాది క్రితం ఇజ్రాయెల్పై దాడిచేసి హమాస్ అపహరించుకుపోయిన బందీలందరినీ విడిపిస్తామని, అప్పటిదాకా పోరాటం కొనసాగుతుందని అధ్యక్షుడు నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్, హిజ్బుల్లాలను తుదముట్టిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com