Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్..డైరెక్ట్ మనీ కాకుండా.. క్రిప్టోలో చెల్లించాలని డిమాండ్..

హార్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించే చమురు నౌకలపై భారీగా ఆదాయం సమకూర్చుకోవాలని ఇరాన్ మాస్టర్ ప్లాన్ వేసింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ జలసంధి గుండా వెళ్లే ప్రతి చమురు ట్యాంకర్ నుంచి ఒక బ్యారెల్కు ఒక డాలర్ వంతున ‘టోల్ ఫీజు’ వసూలు చేయాలని ఇరాన్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలోని అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ చెల్లింపులను సాధారణ కరెన్సీలో కాకుండా క్రిప్టో కరెన్సీ ద్వారా మాత్రమే చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.
అమెరికా వంటి దేశాలు ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్న తరుణంలో.. అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థతో సంబంధం లేకుండా నిధులు సమకూర్చుకోవడానికి ఇరాన్ ఈ ‘క్రిప్టో టోల్’ మార్గాన్ని ఎంచుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ఆయిల్ ఎగుమతిదారుల సంఘం ప్రతినిధి హమీద్ హొస్సేని ఈ ప్రతిపాదనను అధికారికంగా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు 20 శాతం ఈ జలసంధి నుండే వెళ్తుంది కాబట్టి.. ఈ టోల్ గనుక అమలైతే ఇరాన్ ఖజానాకు వేల కోట్ల డాలర్ల ఆదాయం సమకూరనుంది.
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత.. కొన్నాళ్లుగా మూతపడిన హార్మూజ్ జలసంధిని ఇరాన్ తిరిగి తెరిచింది. మెరైన్ ట్రాఫిక్ సంస్థ నివేదిక ప్రకారం.. గ్రీస్కు చెందిన ‘NJ Earth’ అనే బల్క్ క్యారియర్ మరియు లైబీరియా జెండాతో ఉన్న మరో నౌక విజయవంతంగా ఈ జలసంధిని దాటాయి. పశ్చిమ దేశాల నౌకలు కూడా ఈ మార్గంలో ప్రయాణించడం అంతర్జాతీయ వాణిజ్యానికి కొంత ఊరట కలిగించే అంశం.
హార్మూజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం. ఇది పర్షియన్ గల్ఫ్ , గల్ఫ్ ఆఫ్ ఒమన్లను కలుపుతుంది. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ వంటి దేశాల నుంచి వచ్చే చమురు నౌకలకు ఇది ఏకైక మార్గం. ఈ మార్గాన్ని ఇరాన్ తన నియంత్రణలోకి తీసుకుని టోల్ వసూలు చేయాలని చూడటం ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరగడానికి దారితీయవచ్చు. ఇరాన్ తాజా డిమాండ్పై అగ్రరాజ్యాలు ఎలా స్పందిస్తాయో అన్నది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఉత్కంఠ రేపుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
