Israel-Iran War: బంకర్లో తలదాచుకుంటున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ..!

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మరింత ముదురుతున్నది. క్షిపణులు, డ్రోన్లతో ఇరు దేశాలు దాడులు ప్రతిదాడులకు పాల్పడుతున్నాయి. ఇరాన్లోని అణు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. దీంతో టెహ్రాన్ సైన్యానికి చెందిన అత్యున్నత అధికారులతోపాటు పదుల సంఖ్యలో అణు శాస్త్రవేత్తలు మృతిచెందారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ని కూడా లక్ష్యంగా చేసుకొని ఐడీఎఫ్ దళాలు దాడులు చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత వారు ఈశాన్య టెహ్రాన్లోని అండర్గ్రౌండ్ బంకర్లో తలదాచుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది.
జెరూసలెంలో సైరన్ మోతలు
ఇక ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కూడా అదేరీతిలో ప్రతిస్పదిస్తున్నది. ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం కురిపిస్తున్నది. ఈ బాలిస్టిక్ క్షిపణుల దాడిని ఇజ్రాయెల్ గొప్పగా చెప్పుకునే ఐరన్ డోమ్ కూడా అడ్డుకోలేకపోయింది. శత్రుదుర్భేధ్య రక్షణ వ్యవస్థగా చెప్పుకునే దానిని ఇరాన్ క్షిపణులు చీల్చుకుంటూ వెళ్లి ఇజ్రాయెల్ భూభాగంలో పడుతున్నాయి. దీంతో ప్రధాన నగరాలైన టెల్ అవీవ్, జెరూసలెంలో భారీ నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఇరాన్ క్షిపణి దాడులతో జెరూసలెంలో సరైన్ మోతలు వినిపించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అదేవిధంగా జెరూసలెం, టెల్ అవీవ్ మీదుగా క్షిపణులు దూసుకొచ్చాయని వెల్లడించింది. వాటిలో కొన్ని క్షిపణులను మధ్యలోనే తాము కూల్చివేశామని పేర్కొంది. సౌత్వెస్ట్ రీజియన్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేశామని ప్రకటించింది. అయితే హైఫా పట్టణంలో భారీగా మంటలు ఎగసిపడటం కనిపించిందని అంతర్జాతీయ మీడియా ఆర్టీ ఇంర్నేషనల్ వెల్లడించింది. ఈ దాడుల్లో నలుగురు గాయపడ్డారని తెలిపింది.
తదుపరి టార్గెట్ ఖమేనీ.. !
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నట్టు మీడియా కథనాలు వెలువరించాయి. తమ తదుపరి లక్ష్యంగా ఆయన మారవచ్చునని ఒక సీనియర్ అధికారి వాల్స్ట్రీట్ జర్నల్కు తెలిపారు. ఇరాన్ స్వచ్ఛందంగా తన అణు కార్యక్రమాన్ని తొలగించుకునే వరకు లేదా దానిని ఇరాన్ పునర్నిర్మించుకోవడం అసాధ్యంగా మారినప్పుడు మాత్రమే ఈ సంక్షోభానికి తెర పడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఖమేనీ హత్య ప్రణాళికను వీటో చేసిన ట్రంప్
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హత్య చేయాలనే ఇజ్రాయెల్ ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీటో చేశారని ఇద్దరు అమెరికా అధికారులు తెలిపారు. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ప్రశ్నించగా తాను దానిలోకి వెళ్లబోవడం లేదని తెలిపారు. ఇరాన్పై దాడుల గురించి అమెరికాకు ముందస్తు సమాచారం అందజేసినట్టు ఆయన తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com