Iran-Israel War: ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు..

ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. 24 గంటల్లో వరుసగా రెండు సార్లు దాడులకు పాల్పడింది. శుక్రవారం జరిపిన దాడుల్లో ఇరాన్ కీలక నేతలంతా హతమయ్యారు. ఇక తాజాగా శనివారం మరొకసారి ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 78 మంది మృతిచెందారని ఇరాన్ ఐక్యరాజ్యసమితి రాయబారి అమీర్ సయీద్ తెలిపారు. 320 మందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నారు. మృతుల్లో ఎక్కువ మంది పౌరులు, మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారని చెప్పారు. ఇజ్రాయెల్.. ఇరాన్లోని సైనిక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని తెలిపారు.
ఇజ్రాయెల్ శుక్రవారం ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించింది. కేవలం ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. దీంతో అణు శాస్త్రవేత్తల సహా ఇరాన్ కీలక నేతలంతా చనిపోయారు. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్.. అణు కార్యక్రమంతో టెల్ అవీవ్ భద్రతకు ప్రత్యక్ష ముప్పు కలిగిస్తుందని పేర్కొంది. ఇదిలా ఉంటే ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై ప్రతి దాడులు ప్రారంభించింది. మొదటి దాడికి ప్రతీకారంగా 100 డ్రోన్లు ప్రయోగించింది. వీటిని ఇజ్రాయెల్ గాల్లోనే తిప్పికొట్టింది. తాజాగా రెండో దాడికి ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. నివాసాల సమీపంలో పడడంతో 10 మంది గాయపడ్డారు. ఇక వీటిని కూడా ఐడీఎఫ్ ఎదుర్కొంది.
ఇక ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. అమెరికా.. ఇజ్రాయెల్కు చాలా దగ్గరగా ఉందని.. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ నెంబర్ వన్ మిత్రదేశం అని పేర్కొన్నారు. అణు ఒప్పందం కుదుర్చుకోని ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు సరైనవే.. న్యూక్లియర్ డీల్ కోసం ఇరాన్కు 60 రోజుల సమయం ఇచ్చాం.. న్యూక్లియర్ డీల్పై సంతకం చేయకుంటే ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ నాశనం కావడం ఖాయమని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
అణు ఒప్పందం గురించి ఇరాన్కు దాదాపు 60 రోజులు సమయం ఇచ్చాం.. ఈరోజు 61వ రోజు.. ఇరాన్కు దౌత్యం.. సంభాషణల ద్వారా తగినంత సమయం ఇచ్చామని.. అయినా కూడా పట్టించుకోలేదని రాయిటర్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్ దాడి చేస్తానంటే మొదట్లో ఆపామని.. కానీ ఇరాన్ తన పరిధి దాటడంతో కష్టాలు కొని తెచ్చుకుందని అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చెలరేగడం గురించి తనకు ఎలాంటి ఆందోళన లేదని వ్యాఖ్యానించారు.
ఇరాన్తో అణు చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు తాను ఇంకా సమయం ఇస్తున్నట్లు చెప్పారు. ఆదివారం ఒమన్లో జరగనున్న చర్చలకు వాషింగ్టన్ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ దాడి తర్వాత ఇరాన్ చర్చల్లో పాల్గొంటుందనే విషయం తనకు సందేహంగానే ఉందన్నారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ జూన్ 15న ఇరాన్ ప్రతినిధి బృందాన్ని కలవనున్నట్లు పేర్కొన్నారు. అయినా ఇప్పటికైనా సమయం మంచి పోలేదని.. ఇంకా ఆలస్యం కాకముందే ఇరాన్ ఒప్పందం చేసుకుంటే మంచిది అని హితవు పలికారు. ఇరాన్ ప్రతిదాడుల గురించి స్పందిస్తూ.. ఏం జరుగుతుందో చూద్దాం అంటూ వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com