Israel:మధ్యప్రాచ్యంలో తారస్థాయికి చేరిన యుద్ధ వాతావరణం 50 గ్రామాలు ఖాళీ చేయాలని ప్రజలకు హెచ్చరిక

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత తీవ్ర రూపం దాల్చిన ఘర్షణలు.. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య భీకర దాడులకు దారితీశాయి. ఈ క్రమంలో, లెబనాన్లోని సుమారు 50 గ్రామాల ప్రజలు వెంటనే తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం (IDF) సోమవారం హెచ్చరిక జారీ చేసింది.
హిజ్బుల్లా ఉగ్రవాదులు తమ సైనిక కార్యకలాపాలను జనావాసాల నుంచే నిర్వహిస్తున్నారని, ఈ కారణంగా సామాన్య పౌరులకు ఎలాంటి ప్రాణనష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. గ్రామాలకు కనీసం 1000 మీటర్ల దూరంలో ఉన్న ఖాళీ ప్రదేశాలకు వెళ్లాలని ప్రజలకు సూచించింది.
ఈ హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు లెబనాన్పై విరుచుకుపడ్డాయి. రాజధాని బీరుట్తో పాటు దక్షిణ, తూర్పు లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించాయి. 2024 యుద్ధం తర్వాత బీరుట్ నగరం ఈ స్థాయిలో కంపించిపోవడం ఇదే మొదటిసారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ పేరుతో ఇజ్రాయెల్ ఈ దాడులను చేపట్టింది.
ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా గ్రూపు.. ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్లతో దాడికి పాల్పడటంతో ఇజ్రాయెల్ ఈ తీవ్ర ప్రతిచర్యకు దిగింది. తాజా పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
