Gaza : 53 వేలు దాటిన గాజా మృతుల సంఖ్య

గాజా లో ఇజ్రాయెల్ మారణహోమాన్ని సృష్టిస్తోంది. గాజాలోని పలు ప్రాంతాలపై భీకర దాడులకు పాల్పడుతోంది. గత మూడు రోజులుగా వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ఒక్కరోజే ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఏకంగా 115 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
గాజా శివార్లలోని దేర్ అల్ బలాహ్, ఖాన్ యూనిస్ నగరంతో సహా గాజావ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఇజ్రాయెల్ సేనలు బాంబుల వర్షం కురుస్తూనే ఉన్నారు. ఈ దాడుల్లో 115 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ మినహా గల్ఫ్ దేశాలలో జరిపిన పర్యటన ముగిసిన నేపథ్యంలో గాజాపై ఇజ్రాయెల్ దాడులు జరిగాయి. గాజా స్ట్రిప్ సరిహద్దులపై ఇజ్రాయెల్ దిగ్బంధం మూడు నెలలుగా సాగుతోంది.
ఇక దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంపై బుధ-గురువారాల మధ్య రాత్రి ఇజ్రాయెల్ నిర్వహించిన దాడుల్లో 54 మంది మరణించారు. మృతుల్లో ఓ పాత్రికేయుని కుటుంబ సభ్యుల్లో 11 మంది కూడా ఉన్నారు. అంతకు ముందు మంగళవారం రాత్రి బుధవారం తెల్లవారుజామున మధ్య జరిగిన దాడుల్లో 22 మంది చిన్నారులు సహా మొత్తం 70 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా గత మూడు రోజుల వ్యవధిలోనే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజాలో 180 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం మరో 115 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపితే గాజా పోరు మొదలైనప్పటి నుంచి ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియుల సంఖ్య 53 వేలు దాటినట్లు గాజా ఆరోగ్యశాఖ తెలిపింది. లక్షలాది మంది గాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com