Israeli Airstrikes on Gaza: గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు..

గాజాపై శనివారం ఇజ్రాయెల్ చేపట్టిన వైమానిక దాడుల్లో చిన్నారులతో సహా కనీసం 30 మంది పాలస్తీనీయులు మృతి చెందారు. అక్టోబర్ లో అమలులోకి వచ్చిన యుద్ధవిరామం తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరగడం ఇదే మొదటిసారి. హమాస్ యుద్ధవిరామాన్ని ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ ఆరోపించిన మరుసటి రోజే ఈ దాడులు జరగడం అక్కడి పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.
గాజా నగరంలోని ఒక అపార్ట్మెంట్ భవనం, ఖాన్ యూనిస్ లోని ఒక శరణార్థ శిబిరం సహా పలు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. మృతుల్లో రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు మహిళలు, ఆరు మంది పిల్లలు ఉన్నట్లు సమాచారం. గాజా నగరంలోని ఒక పోలీస్ స్టేషన్ను లక్ష్యంగా చేసుకుని చేసిన మరో వైమానిక దాడిలో 14 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళా పోలీస్ సిబ్బంది, కొంతమంది సాధారణ పౌరులు, ఖైదీలు కూడా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. జబాలియా శరణార్థ శిబిరం తూర్పు భాగంలో జరిగిన మరో దాడిలో ఒకరు మృతి చెందినట్లు సమాచారం.
గాజా నగరంలోని అపార్ట్మెంట్పై జరిగిన దాడిలో ముగ్గురు చిన్నారులు, వారి అత్త, అమ్మమ్మ ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఖాన్ యూనిస్లోని గుడారాల శిబిరంపై దాడి కారణంగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఒక తండ్రి, అతని ముగ్గురు పిల్లలు, ముగ్గురు మనవళ్లు సహా ఏడుగురు మృతి చెందారు. యుద్ధవిరామానికి మధ్యవర్తిగా ఉన్న ఈజిప్ట్, ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండిస్తూ.. ఇవి యుద్ధవిరామ రాజకీయ ప్రక్రియకు ప్రత్యక్ష ముప్పు అని హెచ్చరించింది. హమాస్ కూడా ఈ దాడులను ఘోర ఉల్లంఘనగా పేర్కొంటూ, ఇజ్రాయెల్పై ఒత్తిడి తేవాలని అమెరికా సహా ఇతర మధ్యవర్తి దేశాలను కోరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
