Israel-Iran War: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఉంటున్న ప్రాంతంలోనే ఇజ్రాయెల్ దాడులు

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. గత 24 గంటల నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం ఉధృతంగా సాగుతోంది. ఇక శనివారం జరిపిన దాడుల్లో.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా దాడులు జరిగాయి. ఖమేనీ నివాసం సమీపంలో క్షిపణులు పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. టెహ్రాన్లోని మోనిరియాలో ఖమేనీ నివాసం ఉంది. అక్కడే ఇరాన్ అధ్యక్ష కార్యాలయం కూడా ఉంది. ఈ సమీపంలోనే ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ మేరకు ఇరాన్ స్థానిక మీడియా తెలిపింది.
ఇరాన్ మిలటరీ చీఫ్గా అమీర్ హతామీని ఖమేనీ నియమించారు. శుక్రవారం జరిగిన దాడుల్లో మిలటరీ చీఫ్ బాఘేరి చనిపోయారు. బాఘేరి.. ఇరాన్లో అత్యంత శక్తివంతమైన నాయకుడు. అలాంటి నాయకుడు ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు.
ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. 24 గంటల్లో వరుసగా రెండు సార్లు దాడులకు పాల్పడింది. శుక్రవారం జరిపిన దాడుల్లో ఇరాన్ కీలక నేతలంతా హతమయ్యారు. ఇక తాజాగా శనివారం మరొకసారి ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 78 మంది మృతిచెందారని ఇరాన్ ఐక్యరాజ్యసమితి రాయబారి అమీర్ సయీద్ తెలిపారు. 320 మందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నారు. మృతుల్లో ఎక్కువ మంది పౌరులు, మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారని చెప్పారు. ఇజ్రాయెల్.. ఇరాన్లోని సైనిక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని తెలిపారు.
ఇజ్రాయెల్ శుక్రవారం ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించింది. కేవలం ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. దీంతో అణు శాస్త్రవేత్తల సహా ఇరాన్ కీలక నేతలంతా చనిపోయారు. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్.. అణు కార్యక్రమంతో టెల్ అవీవ్ భద్రతకు ప్రత్యక్ష ముప్పు కలిగిస్తుందని పేర్కొంది. ఇదిలా ఉంటే ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై ప్రతి దాడులు ప్రారంభించింది. మొదటి దాడికి ప్రతీకారంగా 100 డ్రోన్లు ప్రయోగించింది. వీటిని ఇజ్రాయెల్ గాల్లోనే తిప్పికొట్టింది. తాజాగా రెండో దాడికి ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. నివాసాల సమీపంలో పడడంతో 10 మంది గాయపడ్డారు. ఇక వీటిని కూడా ఐడీఎఫ్ ఎదుర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com