Rafah: హమాస్‌తో కొనసాగుతున్న హోరాహోరీ

నగరాన్ని వీడిన 10 లక్షల మంది పాలస్తీనియన్లు

ఏడు నెలలుగా జరుగుతోన్న ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య యుద్ధంలో ఎంతో మంది పిల్లలు, మహిళల ప్రాణాలు పోతున్నా...ఇజ్రాయెల్‌ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అంతర్జాతీయంగా చాలా దేశాలు హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇదే క్రమంలో గత ఆదివారం రాత్రి రఫాపై భీకర వైమానిక దాడి చేసింది ఇజ్రాయెల్‌. ఈ దాడిలో ఏకంగా 45 మంది పాలస్తీనా పౌరులు మరణించగా...60 మందికి గాయాలయ్యాయి. ప్రాణాలు కోల్పోయిన వారిలో సగం మంది మహిళలు, చిన్నారులే ఉండటం విషాదం. ఇప్పటివరకు గాజాపై జరిగిన దాడిలో అత్యంత పాశవిక దాడిగా దీన్ని గుర్తించారు. ప్రశాంతంగా ప్రజలు వారి వారి గుడారాల్లో ఉన్న సమయంలో ఒకసారిగా క్షిపణుల దాడి జరిగింది. ప్రమాద తీవ్రతను చూసి ప్రపంచమే కన్నీరు పెట్టుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టేదే.

యుద్ధం ప్రారంభంలో ఉత్తరగాజాలోని పలు ప్రాంతాల్లో హమాస్‌ మిలిటెంట్లు ఉన్నారని వారిపై దాడిలో భాగంగా మీ ప్రాణాలు కోల్పోవద్దని ఇజ్రాయెలే...ఉత్తర గాజాలోని ప్రజలను హెచ్చరించింది. అలా ఉత్తరగాజాలోని ప్రజలు చాలా మంది గతేడాదే పెట్టే, బేడా సర్దుకుని దక్షిణ గాజావైపు తరలిపోయారు. అక్కడ పూర్తిస్థాయిలో దాడులు చేసిన ఇజ్రాయెల్‌... కొన్ని నెలలుగా దక్షిణ గాజాపై ఫోకస్ చేసింది. గత కొంతకాలంగా రఫా శివార్లలో హమాస్‌, ఇజ్రాయెల్‌ రక్షణ దళామైన-IDF మధ్య భీకరపోరు ప్రారంభమైంది. పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్‌ చెప్పినప్పటికీ....భారీస్థాయిలోనే యుద్ధ విమానాలు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా తూర్పు రఫా, పశ్చిమ రఫాను విడదీసే రహదారిపై ఇజ్రాయెల్‌ పెద్ద సంఖ్యలో సైన్యాన్ని మోహరించి దాడుల చేసింది. అటు హమాస్‌ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఐడీఎఫ్‌ దళాలపై భారీస్థాయిలో రాకెట్లను ప్రయోగించింది. ముఖ్యంగా రఫాపై దాడి చేయడానికి ఇజ్రాయెల్‌ చెబుతున్న కారణం...హమాస్‌కు సంబంధించి నాలుగు బెటాలియన్లతో పాటు.. ఆ సంస్థ కీలక నేతలూ ఈ ప్రాంతంలో ఉన్నారని. అందులో భాగంగానే హమాస్ సీనియర్ నేతలు సమావేశమైన కాంపౌండ్‌ను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

ఈజిప్టు-గాజా సరిహద్దు మొత్తాన్ని ఇజ్రాయెల్‌ తన నియంత్రణలోకి తీసుకుంది. ఈ విషయాన్ని బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈజిప్టును ఆనుకొని ఉన్న ఈ ప్రాంతాన్ని ఫిలడెల్ఫి కారిడార్‌ అని పేర్కొంటారు. ఇది దక్షిణ గాజాలోని రఫాలో ఉంటుంది. ఇటీవల రఫా క్రాసింగ్‌ను ఆక్రమించిన ఇజ్రాయెల్‌.. ఇప్పుడు మొత్తం సరిహద్దు ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తీసుకోవడం గమనార్హం. ఈజిప్టు-గాజా సరిహద్దుల్లో భారీస్థాయిలో సొరంగాలు ఉన్నాయి. వీటి ద్వారా హమాస్‌కు ఆయుధాలు అందుతున్నాయని ఇజ్రాయెల్‌ విశ్వసిస్తోంది.

Tags

Next Story