United nations: మానవతా సాయం అందకుంటే 48 గంటల్లో 14 వేల మంది చిన్నారులకు మృత్యు గండం

ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజాలో పరిస్థితులు పూర్తిగా మారాయి. అక్కడి ప్రజల జీవనం ప్రశ్నార్థంగా మారింది. ఇప్పటికే గాజాను అన్ని వైపులా నిర్బంధించిన ఇజ్రాయెల్ పరిమిత స్థాయిలో మాత్రమే మానవతా సాయానికి అనుమతిస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఈ పరిస్థితిపై స్పందించిన ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మానవతా సాయం ఇలాగే కొనసాగితే మరో 48 గంటల్లో 14 వేల మంది చిన్నారులు మరణించే అవకాశం ఉందంటూ హెచ్చరించింది.
11 వారాల క్రితం పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ నిర్బంధించింది. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, యూకే ఒత్తిడి చేయడంతో పరిమిత స్థాయిలో గాజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అనుమతిస్తోంది. ‘‘చిన్నారులతో సహా గాజా వాసులకు ఇటీవల ఐదు ట్రక్కుల మానవతా సాయం మాత్రమే అందింది. అక్కడి పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. వారికి మరింత సాయం అవసరం. లేదంటే మరో 48 గంటల్లో 14 వేల మంది చిన్నారులు మృత్యువాత పడే అవకాశం లేకపోలేదు. అక్కడున్న చిన్నారులు, తల్లులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు’’ అని ఐరాస ప్రతినిధి టామ్ ప్లేచర్ హెచ్చరించారు.
మానవతా సాయం విషయంలో ఇజ్రాయెల్ తీరును బ్రిటన్, ఫ్రాన్స్, కెనడాలు తీవ్రంగా ఖండించాయి. గాజాకు మానవతా సాయంపై తమ ఆంక్షలను వెనక్కి తీసుకోకపోతే తామంతా ఉమ్మడి చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. తాజాగా ఇజ్రాయెల్ తీరుపై ఐరాస స్పందించింది. పోషకాహారంతో కూడిన 100 ట్రక్కుల మానవతా సాయాన్ని గాజాలోకి అనుమతించాలని.. చిన్నారుల ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నించాలని కోరింది.
తాజా దాడుల్లో 60 మంది దుర్మరణం
మంగళవారం గాజా స్ట్రిప్లోని ఖాన్ యూనిస్, గాజా సిటీ, డెయిర్ అల్-బలాహ్ తదితర ప్రాంతాల్లో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో కనీసం 60 మంది మృతి చెందారని పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. పునరావాస కేంద్రంగా మారిన ఇండ్లు, బడిపై జరిగిన దాడిలో 18 మంది మృతి చెందారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com