Jaish-e-Mohammed : బీభత్సానికి నిధుల సేకరణ.. జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రసంస్థ కొత్త ప్లాన్

Jaish-e-Mohammed : బీభత్సానికి నిధుల సేకరణ.. జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రసంస్థ కొత్త ప్లాన్
X
ప్రచారానికి జైషే చీఫ్ మౌలానా మసూద్ అజార్, అతని సోదరుడు తల్జా అల్ సైఫ్ నాయకత్వం

భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) కోరలు తీసిన పాములా తయారైంది. ఇప్పుడు ఈ ఉగ్రవాద సంస్థ క్రమక్రమంగా తిరిగి బలం పుంజుకొని బీభత్సాన్ని సృష్టించడానికి కొత్త ప్లాన్ వేసింది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఉగ్రసంస్థ రహస్యంగా నిధుల సేకరణ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. పాకిస్థాన్ అంతటా 3.91 బిలియన్ల PKRలను సేకరించడం ద్వారా 313 కొత్త మర్కజ్‌లను (శిక్షణా శిబిరాలు, సురక్షిత ప్రాంతాలు) ఏర్పాటు చేయడం లక్ష్యంగా పని చేస్తోంది.

ఈ ప్రచారానికి జైషే చీఫ్ మౌలానా మసూద్ అజార్, అతని సోదరుడు తల్జా అల్ సైఫ్ నాయకత్వం వహించారు. ఈక్రమంలో వారు మద్దతుదారుల నుంచి పెద్ద మొత్తాల్లో విరాళాలు సేకరించారు. ఈ విరాళాలను FATF (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) పరిశీలన నుంచి తప్పించడానికి ఈజీపైసా, సదాపే వంటి డిజిటల్ వాలెట్లను ఉపయోగించారు. ఈ డిజిటల్ వాలెట్లు మసూద్ అజార్ కుటుంబానికి చెందిన మొబైల్ నంబర్లతో రిజిస్టర్ అయ్యాయని దర్యాప్తులో తేలింది. ఈ నెంబర్లలో అతని సోదరుడు తల్జా అల్ సైఫ్, కుమారుడు అబ్దుల్లా అజార్ నంబర్లు కూడా ఉన్నట్లు సమాచారం. అలాగే పాకిస్థాన్‌లోని మసీదులలో గాజా పేరుతో విరాళాల వసూలు చేస్తున్నట్లు దర్యాప్తులో వెలుగుచూసింది. అయితే ఈ డబ్బును జైష్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించారని దర్యాప్తు అధికారులు తెలిపారు.

విరాళాలు సేకరిస్తున్న అల్ రెహమత్ ట్రస్ట్

అల్ రెహమత్ ట్రస్ట్‌ను స్వయంగా మసూద్ అజార్, తన సన్నిహితులు నిర్వహిస్తున్నారు. ఈ ట్రస్ట్ బహావల్పూర్లోని ఒక బ్యాంకు ఖాతా ద్వారా నిధులు సేకరిస్తోంది. ఈ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సేకరించిన నిధులతో మర్కజ్‌లో కొత్తగా నిర్మించిన సురక్షితమైన భవనాలు మసూద్ అజార్, అతని కుటుంబం ఉనికిని దాచి ఉంచడానికి విశేషంగా ఉపయోగపడుతున్నాయి. ఈ రహస్య స్థావరాలను కొత్త ఉగ్రవాదుల నియామకం, శిక్షణ కోసం కూడా ఉపయోగించాలని ఉగ్రవాద సంస్థ నిర్ణయించినట్లు సమాచారం.

పలు నివేదికల ప్రకారం.. ఈ నిధుల సేకరణ కార్యక్రమం విజయవంతమైందని తెలుస్తుంది. ఉగ్రసంస్థకు పాకిస్థాన్, విదేశాల నుంచి భారీ మొత్తంలో నిధులు సమకూరినట్లు స్పష్టం అవుతుంది. జైషే ఉగ్రసంస్థ ఈ నిధులతో మెషిన్ గన్స్, రాకెట్ లాంచర్లు, మోర్టార్ల వంటి ఆధునిక ఆయుధాలను కొనుగోలను చేసిందని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. కొత్త ఆయుధాలు, విస్తరించిన మౌలిక సదుపాయాలతో జైష్-ఎ-మొహమ్మద్ ప్రపంచంపై కొత్త భీభత్సాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉందని నిఘా సంస్థలు వెల్లడిస్తున్నాయి. అధునాతన రహస్య కమ్యూనికేషన్ సాయంతో ఉగ్రవాద సంస్థ నాయకులు వారిని గుర్తించబడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ నిఘా నీడకు దొరకడం లేదు.

Tags

Next Story