Pakistan Attack : పాక్ కాల్పుల్లో భారత కవలలు మృతి

Pakistan Attack : పాక్ కాల్పుల్లో భారత కవలలు మృతి
X
తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి

భారత్ పై కోపంతో విచక్షణ కోల్పోయి కాల్పులు జరుపుతున్న పాక్ అన్యం పుణ్యం ఎరుగని ఇద్దరు కవలపిల్లలను పొట్టనబెట్టుకుంది. జమ్మూకశ్మీర్ పూంఛ్ జిల్లాలో ఈనెల 7న పాక్ ఆర్మీ జరిపిన మోర్టార్ షెల్లింగ్ లో 12 ఏళ్ల జోయా, అయాన్ ఖాన్ మరణించారు. చిన్నారుల తండ్రి రమీజ్ ఖాన్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన పిల్లలు చనిపోయారనే విషయం కూడా పాపం ఆ తండ్రికి ఇప్పటికి తెలియదు. ఇటీవలే సంతోషంగా పుట్టినరోజు జరుపుకున్న ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో వారి తల్లి ఉర్షా ఖాన్ తల్లడిల్లుతోంది. తీవ్రంగా గాయపడిన చిన్నారుల తండ్రి రమీజ్ ఖాన్ (48) ప్రస్తుతం జమ్మూలోని ఓ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆయన కాలేయం దెబ్బతిన్నట్టు వైద్యులు తెలిపారు. రమీజ్ ఖాన్ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయకూడదన్న ఉద్దేశంతో పిల్లల మరణవార్త ఆయనకు తెలియకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్త పడుతున్నారు. కన్నబిడ్డలను కోల్పోయిన దుఃఖం ఒకవైపు, భర్త ప్రాణాలతో పోరాడుతుండటం మరోవైపు.. ఈ రెండింటి మధ్య తల్లి ఉర్షా ఖాన్ మానసికంగా కుంగిపోయారని సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు నెలల క్రితమే పూంచ్‌కు

విద్యావకాశాల కోసం వారి కుటుంబం రెండు నెలల క్రితమే పూంచ్‌కు మకాం మార్చింది. కాగా భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన తరువాత, పాకిస్తాన్ నుండి భారీ షెల్లింగ్, డ్రోన్ దాడులలో ఐదుగురు భద్రతా సిబ్బందితో సహా కనీసం 27 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయినందుకు భారత్ ప్రతీకారంగా ఈ ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించింది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించి దాదాపుగా వందకు పైగా ఉగ్రవాదులను హతం చేసింది.

Tags

Next Story