WAR: కమ్మేసిన యుద్ధ మేఘాలు

మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉన్నట్లు కనిపిస్తోంది. గాజాతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ దాడులను కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇటీవల ఇజ్రాయెల్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఇది ఇజ్రాయెల్ పనేనని ఆరోపించిన ఇరాన్.. ఇందుకు ప్రతీకారంగా దాడులు తప్పవని ఇప్పటికే హెచ్చరించింది. ఈ క్రమంలో గాజాతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ దాడులు కొనసాగిస్తామని నెతన్యాహు పేర్కొన్నారు. దాడుల నుంచి రక్షణ, దేశ భద్రతా అవసరాల దృష్ట్యా అన్నివిధాలుగా సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్ భద్రత కోసం ఆలోచిస్తున్న అమెరికా.. ఆ దేశ సెంట్రల్ కమాండ్ అధికారి జనరల్ మైకేల్ ఎరిక్ కొరిల్లాను యూదుదేశానికి పంపించి పరిస్థితి సమీక్షిస్తోంది. ఇజ్రాయెల్కు అన్ని విధాలా అండగా ఉంటామని, ఆ దేశ భద్రతకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పష్టం చేశారు. మధ్యప్రాచ్య పరిస్థితులపై జర్మనీ, రష్యా స్పందించాయి. ఈ వ్యవహారంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, సంయమనం పాటించాలని కోరాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జర్మన్ విమానయాన సంస్థ లుఫ్తాన్సా.. ఏప్రిల్ 13 వరకు టెహ్రాన్కు విమానాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
మరోవైపు పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం విస్తరించే ప్రమాదం కనిపిస్తున్నది. ప్రస్తుత పరిస్థితిల్లో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తప్పదేమోనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. గాజాలో తమ భద్రతా దళాలు ఆపరేషన్ కొనసాగిస్తున్న వేళ ఇలాంటి దృశ్యాలు మరోచోట కూడా చూడటానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రకటించడంతో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తప్పదంటూ సంకేతాలు వెలువడ్డాయి. ఏప్రిల్ 1న సిరియాలోని కాన్సులేట్పై ఇజ్రాయెల్ జరిపిన వాయు సేన దాడిలో ఇరాన్కు చెందిన టాప్ మిలటరీ జనరల్తో పాటు ఆరుగురు అధికారులు మరణించారు. దీంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ యుద్ధ భయంతో టెహ్రాన్కు ఈ నెల 13 వరకు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్టు జర్మనీ ఎయిర్లైన్స్ లుఫ్తాన్సా ప్రకటించింది. ఇజ్రాయెల్, లెబనాన్, పాలస్తీనియన్ వంటి పశ్చిమాసియా ప్రాంతాలకు ప్రయాణించవద్దంటూ రష్యా విదేశాంగ శాఖ తన పౌరులకు సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com