MAY DAY: శ్రమిద్దాం.. శ్రమని గౌరవిద్దాం

మనం ప్రతియేటా మే 1వ తేదీన మేడే లేదా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం ( Labour Day 2024 ) జరుపుకుంటామన్న విషయం తెలిసిందే. మే డే జరుపుకునేందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఆ రోజున కార్మికులు వారి హక్కులను గుర్తు చేసుకోవడం, సమాజానికి వారు చేసిన సేవలకు గాను తగిన గుర్తింపు ఇచ్చి వారిని సన్మానించడం. కార్మిక దినోత్సవం మూలాలు పరిశీలిస్తే మనకు 19వ శతాబ్దంలో కనిపిస్తాయి. అప్పుడు అమెరికాలో కార్మికులు తమ హక్కుల కోసం పోరాడారు. 1886, మే 1న దాదాపు 2 లక్షల మంది కార్మికులు 8 గంటల పనిదినాన్ని డిమాండ్ చేస్తూ భారీ సమ్మెకు దిగారు. అంతేకాకుండా చక్కటి పనివాతావరణాన్ని కల్పించడం, తక్కువ వేతనాలు, బాలకార్మికుల వంటి అంశాలపై కూడా పోరాటం చేశారు. అమెరికాలో ప్రారంభమైన ఈ ఉద్యమం అటు ఐరోపా దేశాలకు కూడా పాకింది. షికాగోలో హిసాత్మకంగా మారింది. షికాగోలోని హేమార్కెట్ స్క్వేర్లో జరిగిన శాంతియుత సమావేశంలో బాంబు పేలడంతో ఈ ఘటన విషాదకరంగా మారింది. ఈ ఘటనలో ఇటు పోలీసులు అటు సమ్మెలో ఉన్న కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. షికాగో మారణకాండలో ప్రాణాలర్పించిన కార్మికులను స్మరిస్తూ.. ఏటా మే 1వ తేదీన కార్మిక దినోత్సవం నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలకు మే డే వేదికగా మారింది. అనేక దేశాల్లో ఆ రోజున పోరాటాలూ, నిరసన ప్రదర్శనలూ చేపట్టడం పరిపాటైంది. 1923 నుంచి ఇండియాలో ‘మే డే’ను పాటించారు. కరోనా వల్ల గతేడాది నుంచి ఎంతోమంది శ్రమ జీవులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. వారిలో ధైర్యం నింపడం మన అందరి కర్తవ్యం.
సూర్యచంద్రులు.. కార్మికులు
ప్రపంచాన్ని బతికించడానికి సూర్య చంద్రులు కార్మికుల్లా పనిచేస్తుంటే, ప్రపంచాన్ని నడిపించడానికి కోట్లాదిమంది కార్మికులు సూర్యచంద్రుల్లా రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఆ కష్టానికి ఫలితాన్ని ఆశించడం ప్రతి ఒక్కరి హక్కు. ఒకప్పుడు మాత్రం అది నేరం. ఎవరైనా ప్రశ్నిస్తే విప్లవకారుడన్న ముద్ర వేసి జైల్లో తోసేవారు. 19వ శతాబ్దం చివరి వరకూ పరిస్థితులు అలానే కొనసాగాయి. ఆరోగ్యాన్నీ, వ్యక్తిగత జీవితాన్నీ పణంగా పెట్టి రోజుకు పన్నెండు గంటలకు పైగా కార్మికులు పని చేసేవారు. దశాబ్దాల తరబడి అదే విధానానికి అలవాటు పడ్డ శ్రామికులు కమ్యూనిస్టు, సోషలిస్టు పార్టీల అండతో మొదట రష్యాలో ‘ఎనిమిది గంటలు పని’ నినాదాన్ని అందుకున్నారు. అది ఇతర దేశాలకూ పాకింది. కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మారుస్తారు. మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలోని కొందరు రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు. తమ శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేమూ మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయని శ్రామికులు గొంతెత్తారు.
మన దేశంలో ఇలా...
భారత్లో మొదటిసారిగా 1923 మే 1వ తేదీన కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. మనదేశంలో ఇతర దేశాల కంటే ముందే కలకత్తాలో కార్మికుల పనిగంటల కోసం హౌరా రైల్వే స్టేషన్లో 1862లోనే సమ్మె చేశారు. 1923లో తొలిసారిగా భారత్ దేశంలో మే డే ను పాటించారు. ఆ తర్వాత 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడడంతో అప్పటి నుంచి కార్మికవర్గాల్లో చైతన్యం మొదలైంది. దీంతో మే డే పాటిస్తున్నారు. కానీ అసంఘటిత కార్మిక వర్గం అన్ని రంగాల్లో వచ్చింది. 1985 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ (ఎల్పీజీ) పరిణామాల వల్ల అసంఘటిత కార్మికవర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడంలేదు. రెండో ప్రపంచ యుద్ధం తరవాత ఐరోపా దేశాల్లో మే 1వ తేదీని సెలవు దినంగా పాటించడం మొదలుపెట్టారు. అనంతరం అనేక దేశాలు ఇదే బాటలో నడిచాయి. చాలా దేశాల్లో కార్మికులకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు ఆ రోజునే అమల్లోకి వచ్చాయి. ఈ రోజును హిందీలో "కామ్గర్ దిన్" అని, కన్నడలో "కార్మికర దినచరనే" అని, మరాఠీలో "కమ్గర్ దివస్" అని మరియు బెంగాలీలో "ష్రోమిక్ దిబోష్" అని పిలుస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాల్లో కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
