PM MODI: మోదీకి గ్రీస్‌ అత్యున్నత పురస్కారం

PM MODI: మోదీకి గ్రీస్‌ అత్యున్నత పురస్కారం
ప్రధాని మోదీకి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్... ప్రదానం చేసిన గ్రీస్‌ అధ్యక్షురాలు

గ్రీస్‌ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఆ దేశ అత్యున్నత పురస్కారం అందుకున్నారు. గ్రీస్ అధ్యక్షురాలు కాటెరినా సకెల్లారోపౌలౌ( Greek President Katerina N. Sakellaropoulou) ప్రధాని మోదీకి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్(Grand Cross of the Order of Honour ) పురస్కారాన్ని అందించారు. నీతిమంతులు మాత్రమే గౌరవించబడాలనే ఎథీనా అనే దేవత సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని 1975లో గ్రీస్‌ ప్రభుత్వం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్ పురస్కారాన్ని ఇవ్వడం ప్రారంభించింది(Order of Honour was established in 1975 ). గ్రీస్‌ అభివృద్ధికి, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేసిన గ్రీస్‌ ప్రధానులకు, విదేశాల ప్రముఖులకు ఈ పురస్కారం ప్రదానం చేస్తారు. గ్రీక్-భారత్‌ స్నేహ బంధం బలోపేతానికి కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశం ఈ పురస్కారం ప్రదానం చేసినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.


మరోవైపు బ్రిక్స్ సదస్సులో భాగంగా దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకుని గ్రీస్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీకి ఘన స్వాగతం లభించింది. గత 40 ఏళ్లలో గ్రీస్ లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. మోదీకి ఏథెన్స్( Athens)లో ఘన స్వాగతం లభించింది. మోదీని చూసేందుకు అక్కడి భారతీయులు భారీగా ఎయిర్ పోర్టుకు తరలివెళ్లారు. వారిని ప్రధాని ఆత్మీయంగా పలకరిస్తూ కరచాలనం చేశారు. ఈ పర్యటనలో నరేంద్రమోదీ గ్రీస్ ప్రధానితో పాటుఅధ్యక్షుడు సకెల్లారోపౌలౌ(Greek President Katerina N. Sakellaropoulou )తో భేటీ అయి చర్చలు జరపనున్నారు. ప్రతినిధుల స్థాయి చర్చల అనంతరం ఇరు దేశాల ముఖ్య వ్యాపారాలపై ఇరువురు నేతలు ప్రసంగిస్తారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే ప్రధాన అజెండాగా ఈ పర్యటన సాగుతోంది. కాగా. 1983లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చివరిసారిగా.. గ్రీస్ లో పర్యటించారు.


ఇరు దేశాలకు చెందిన వ్యాపారవేత్తలతోనూ మోదీ సంభాషించనున్నారు. గ్రీస్‌లోని భారతీయ సభ్యులతో కూడా భేటీ కానున్నారు. గ్రీస్‌లో ప్రధాని మోదీ కీలక చర్చల్లో పాల్గొంటారు. వాణిజ్యం, పెట్టుబడులు, షిప్పింగ్ వంటి విభిన్న అంశాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. విమానాశ్రయాలు, ఓడరేవులను ప్రైవేటీకరించడంలో భారతదేశ సహాయాన్ని పొందాలని గ్రీస్ భావిస్తోంది. దీంతో ఐరోపాలోకి ఇండియా అడుగుపెట్టేందుకు గ్రీస్‌ ఎంట్రీ పాయింట్‌గా ఉపయోగపడనుంది.

Tags

Read MoreRead Less
Next Story