Nepal PM :నోరు జారి నాలిక కరచుకున్న నేపాల్ ప్రధాని

Nepal PM :నోరు జారి  నాలిక కరచుకున్న  నేపాల్ ప్రధాని
వివరణలు వద్దు రాజీనామా కావాలంటున్న విపక్షాలు

నేపాల్‌ ప్రధానమంత్రి పుష్పకుమార్‌ దహల్‌ ప్రచండ వివాదంలో చిక్కుకున్నారు. నేపాల్‌లో స్థిరపడిన ఓ భారత వ్యాపారి తనను ప్రధానిని చేసేందుకు గతంలో సాయం చేశారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రచండ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

కాఠ్‌మాండూలో నివసిస్తున్న ప్రముఖ భారత వ్యాపారవేత్త సర్దార్‌ ప్రీతమ్‌సింగ్‌ జీవితకథపై రచించిన ‘రోడ్స్‌ టు ది వ్యాలీ’ పుస్తకావిష్కరణ కార్యక్రమం గత సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని ప్రచండ మాట్లాడుతూ నేపాల్‌ - భారత్‌ బంధాన్ని బలోపేతం చేయడంలో సర్దార్‌ ప్రీతమ్‌సింగ్‌ ముఖ్యపాత్ర పోషించారన్నారు. ఆయన ఓ సందర్భంలో తనని ప్రధానిగా చేసేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. తన కోసం ప్రత్యేకంగా అనేకసార్లు ఢిల్లీ వెళ్ళ్లారని, కాఠ్‌మాండూలోని రాజకీయ నేతలతో పలుమార్లు చర్చలు జరిపారనీ అన్నారు.




ఈ వ్యాఖ్యలు నేపాల్‌ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. నేపాల్ ప్రధాని నియామకం ఢిల్లీ కనుసన్నల్లో జరిగిందని ప్రధాని ప్రచండకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే తన పదవికి రాజీనామా చెయ్యాలని అక్కడి ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి . ప్రధాన ప్రతిపక్షమైన కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌ ఈ వ్యాఖ్యలపై ప్రచండ కేవలం వివరణ ఇస్తే చాలదని, దీనికి నైతికబాధ్యత వహిస్తూ తక్షణమే పదవి నుంచి వైదొలగాలనీ డిమాండ్ చేశారు. ప్రచండ మాటలు దేశ స్వతంత్రత, మర్యాదకు భంగం కలిగించాయన్నారు. రాజ్యాంగం, దేశ పార్లమెంటును అవమానించేలా ఉన్నాయంటూ దుయ్యబట్టారు. విపక్షాలే కాదు, సంకీర్ణ ప్రభుత్వంలోని కొందరు నేతలు కూడా ప్రచండ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ వివాదంపై ప్రధాని ప్రచండ స్పందిస్తూ.. తన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరించి వివాదం రేపుతున్నారని ఆరోపించారు. పుస్తకంలో ప్రీతమ్‌సింగ్‌ పేర్కొన్న అంశాలనే తాను చెప్పానని అన్నారు. అంతర్గత రాజకీయాల్లో భారత్ పాత్ర ఉందని చెప్పడం తన ఉద్దేశ్యం కాదు ప్రీతమ్ సింగ్ కు సాంఘిక సంక్షేమం మీదనే కాదు రాజకీయాల పైన కూడా అంతే ఆసక్తి ఉండేదని చెప్పాలనుకున్నట్లు తెలిపారు.

ప్రతిపక్షాలు మాత్రం వివరణ కాదు రాజీనామా మాత్రమే కావాలని పట్టుబట్టడంతో నేపాల్ జాతీయ అసెంబ్లీ సమావేశానికి నిరవధికంగా అంతరాయం కలిగింది.

Tags

Read MoreRead Less
Next Story