North korea: నార్త్ కొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగం

North korea: నార్త్ కొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగం
జ‌పాన్ స‌ముద్ర జ‌లాల్లో ప‌డిన‌ట్లు సమాచారం

నార్త్ కొరియా మరోసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. అమెరికాను బెదిరించిన ఒక్క రోజు తరువాతే ఉత్తరకొరియా ఖండాంతర బాలిష్టిక్ క్షిపణి పరీక్ష నిర్వహించిన విషయాన్ని జపాన్, దక్షిణ కొరియా అధికారులు ధృవీకరించారు. ఆ మిస్సైల్ జ‌పాన్ జ‌లాల్లో ప‌డింది. ఇటీవ‌ల అమెరికా వార్నింగ్ ఇచ్చినా.. ఉత్తర కొరియా మాత్రం త‌న మిస్సైల్ టెస్టింగ్‌ను ఆప‌డం లేదు..

ఐసీఎంబీని నార్త్ కొరియా ప‌రీక్షించిన‌ట్లు జ‌పాన్‌, ద‌క్షిణ కొరియా దేశాలు అనుమానం వ్య‌క్తం చేశాయి. సుదీర్ఘ దూరం వెళ్లే ఆ ఖండాంతర క్షిపణి తూర్పు దిశగా కొంతసేపు పయనించిదాదాపు గంట‌న్న‌ర తరువాత జ‌పాన్ స‌ముద్ర జ‌లాల్లో ప‌డిన‌ట్లు చెబుతున్నారు. ఇటీవ‌ల అమెరికా నిఘా విమానాల ఉత్త‌ర కొరియా గ‌గ‌న‌త‌లంలోకి ప్ర‌వేశించాయి. ఈ నేపథ్యంలో కింగ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు చేశారు. తమతో పెట్టుకోవద్దని, తమ భూభాగంలోకి అగ్ర రాజ్య నిఘా విమానాలు ప్రవేశిస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు ఈ నేప‌థ్యంలో నార్త్ కొరియా మ‌రోసారి ఐసీఎంబీ ప‌రీక్ష‌తో అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన‌ట్లు నిపుణులు చెబుతున్నారు.


అయితే నార్త్ కొరియా చేసిన ఆరోప‌ణ‌ల్ని అమెరికా ఖండించింది. త‌మ సైనిక ద‌ళాల పెట్రోలింగ్ అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌కు లోబ‌డి ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. ఇటీవ‌ల నార్త్ కొరియా వ‌రుస‌గా క్షిప‌ణుల్ని ప‌రీక్షించ‌డంతో ఉద్రిక్త‌త మొద‌లైంది. ఆ త‌ర్వాత అమెరికా, సౌత్ కొరియా దేశాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేప‌ట్టాయి.

మరోవైపు ఈ ఆరోపణలను దక్షిణ కొరియా ఖండించింది. అమెరికా ఎప్పటిలాగే సాధారణ నిఘా కార్యకలాపాలు చేపట్టిందని అవి నిత్యం జరిగేవేనని వెల్లడించింది. ఇలాంటి తప్పుడు ఆరోపణల ద్వారా ఉద్రిక్తత సృష్టించే చర్యలను వెంటనే నిలిపివేయాలని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ప్రతినిధి కిమ్‌ సోదరికి సూచించారు. అమెరికా ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా అంతర్జాతీయ జలాలు, గగనతలంలో పనిచేస్తుందని వివరించారు. కిమ్ సోదరి వ్యాఖ్యలపై అమెరికా కూడా పరోక్షంగా స్పందించింది. అంతర్జాతీయ చట్టం అనుమతించే ఎక్కడైనా సురక్షితంగా, బాధ్యతాయుతంగా తమ విమానాలు తిరుగుతాయని పెంటగాన్ స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story