North Korea : ప్రపంచదేశాలకు న్యూక్లియర్ సవాల్..

North Korea : ప్రపంచదేశాలకు  న్యూక్లియర్ సవాల్..
అటాక్‌ సబ్‌మెరైన్‌ను ఆవిష్కరించిన కిమ్‌ , త్వరలోనే రష్యాతో భేటీ ..

కిమ్‌జోంగ్‌ ఉన్‌ నేతృత్వంలోని ఉత్తరకొరియా అణు కార్యక్రమాలను ఏమాత్రం ఆపడంలేదు. అణు జలాంతర్గామిని ప్రారంభించి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. రెండు రోజుల క్రితం ప్యాంగ్యాంగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కిమ్‌ స్వయంగా పాల్గొన్నారు. ఓ షిప్‌ యార్డ్‌లో సబ్‌మెరైన్‌ను పరిశీలిస్తున్న ఫొటోను విడుదల చేశారు. దీని నుంచి అణ్వాయుధాలు కూడా ప్రయోగించవచ్చని ఉ.కొరియా న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. ఇది సోవియట్‌ కాలం నాటి రోమియో శ్రేణి సబ్‌మెరైన్‌ డిజైన్‌ ఆధారంగా చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త సబ్‌మెరైన్‌కు ‘హీరో కిమ్‌ గన్‌-ఓకే’ అనే పెట్టారు.


దీని హల్‌ నంబర్‌ 841. ఈ సబ్‌మెరైన్‌ నుంచి రెండు వరుసల్లో 10 న్యూక్లియర్‌ బాలిస్టిక్‌ మిసైల్స్‌ను ప్రయోగించవచ్చు. తాజాగా రష్యా అధ్యక్షుడితో భేటీ అయిన కిమ్ జోంగ్ స్వదేశమైన ఉత్తర కొరియాకు రాగానే అణు జలాంతర్గామిని ప్రారంభించారు. ఈ సబ్ మెరైన్ లాంచ్ వేడుక నార్త్ కొరియా నావికాదళాన్ని బలోపేతం చేయడానికి నాంది పలికిందని డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా తెలిపింది. ఇటీవల కిమ్ జోంగ్ పలుసార్లు క్షిపణులను ప్రయోగించారు. నిత్యం ఆర్మీ బలోపేతంపై దృష్టి సారించిన కిమ్ జోంగ్ అణు జలాంతర్గామిని ప్రారంభించి సంచలనం రేపారు.


రష్యా సబ్‌మెరైన్‌లో ఉత్తరకొరియా భారీగానే మార్పులు చేసిందని నౌకాదళ నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం అణుదాడి చేసేది మాత్రమే కావచ్చని.. ఇది అణుశక్తితో నడిచేది కాకపోవచ్చని అమెరికా నిపుణులు విశ్లేషిస్తున్నారు. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో త్వరలో భేటీ అయ్యే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఓ అధికారి ఇటీవల తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్నందున రష్యా ఆయుధాలను సమీకరించాలనుకుంటోందని.. ఈ నేపథ్యంలోనే కిమ్‌ ఆ దేశంలో పర్యటించే అవకాశాలున్నాయని వెల్లడించారు.



గత నెలలో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఉత్తర కొరియా వెళ్లారని అమెరికా జాతీయ భద్రత మండలి ప్రతినిధి అడ్రియన్‌ వాట్సన్‌ తెలిపారు. క్రెమ్లిన్‌కు ఆయుధాలు విక్రయించేలా చర్చలు జరిపారని చెప్పారు. ఈ నేపథ్యంలో కిమ్ త్వరలో రష్యాకు వెళ్లి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఆయుధాల విక్రయాలపై చర్చించనున్నారు.తూర్పు రష్యాలోని వ్లాడివోస్టాక్‌లో ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ పర్యటన కోసం అతను భద్రతా సౌకర్యాలతో కూడిన ప్రత్యేక రైలును ఉపయోగిస్తారని సమాచారం.ఇటీవలి సంవత్సరాలలో అతను కొన్ని సార్లు మాత్రమే ప్రయాణాలు చేశారు.

ఇటీవల అమెరికా-దక్షిణ కొరియా చేపట్టిన సంయుక్త సైనిక విన్యాసాలు ముగియడంతోనే ఉత్తర కొరియా పెద్దఎత్తున క్రూయిజ్‌ క్షిపణుల్ని సముద్రం పైకి ప్రయోగించింది. 11 రోజులపాటు అమెరికా-దక్షిణ కొరియా చేసిన విన్యాసాలు తమపై దురాక్రమణ కోసమేనని ఆరోపించింది.

Tags

Read MoreRead Less
Next Story