Kim Jong Un : ఉత్తర కొరియా వారసురాలిగా కిమ్ జు యే..

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వారసులు ఎవరు? అనే అంశంపై మరోసారి చర్చ జరుగుతోంది. కిమ్ జోంగ్ తన టీనేజర్ కుమార్తెనే వారసురాలిగా ప్రకటించబోతున్నట్టు దక్షిణ కొరియా సంచలన నివేదిక వెలువరించింది. ఈ మేరకు సియోల్ ‘నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్’ అంచనా వేసింది. ఈ విషయాన్ని చట్టసభ సభ్యుల దృష్టికి నిఘా సంస్థ తీసుకెళ్లింది. 13 ఏళ్ల కిమ్ జు యే ఉత్తర కొరియా భవిష్యత్తు నాయకురాలిగా నియామకానికి చేరువలో ఉన్నట్లు పేర్కొంది. ఈ నెల చివరిన ఉత్తర కొరియా భారీ రాజకీయ సదస్సును నిర్వహణకు సన్నాహాలు చేస్తున్న వేళ ఈ నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో రాబోయే ఐదేళ్లలో విధానపరమైన లక్ష్యాలు వివరిస్తారని, అధికారంపై తన పట్టును మరింత పటిష్టం చేసుకుంటారని భావిస్తున్నారు.
కిమ్ జు యేను మొదటిసారిగా నవంబరు 2022లో ప్రపంచానికి కిమ్ పరిచయం చేశారు. ఆ తర్వాత 2023లో సైనిక వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మరోసారి తండ్రితో కలిసి వచ్చింది. అప్పటి నుంచి అడపాదడపా అధికారిక కార్యక్రమాలకు ఆ చిన్నారి హాజరవుతోంది. గత నెలలో దేశ మాజీ నాయకుల స్మారకం ‘కుమ్సుసన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్’ను తల్లిదండ్రులతో కలిసి సందర్శించింది. ఈ సంఘటనలు కిమ్ వారసురాలు ఆమేనన్న వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.
మొదట్లో ఉత్తర కొరియా పగ్గాలను ఆమెకే అప్పగిస్తారా? అని దక్షిణ కొరియా నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఎందుకంటే వారి సంప్రదాయవాదం, పురుషాధిక్య నాయకత్వ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అంచనాకు వచ్చారు. కానీ, తరుచుగా ఆ దేశ మీడియా ఆమె గురించి ప్రత్యేక కథనాలు ప్రచురించడంతో తమ అంచనాలను దక్షిణ కొరియా నిఘా అధికారులు పునఃసమీక్ష చేశారు. ఈ నేపథ్యంలోనే వారసురాలిగా ఆమె నియమాకం కీలక దశలో ఉన్నట్లు గుర్తించారు. ఉన్నతస్థాయి మిలటరీ కార్యక్రమాలకు హాజరుకావడం, కుమ్సుసన్ను సందర్శించడం, గతేడాది సెప్టెంబరులో తండ్రితో కలిసి చైనా సైనిక పరేడ్కు వెళ్లడం, కొన్ని విధానపరమైన అంశాల్లో కిమ్ తన కుమార్తె అభిప్రాయాలను కోరడం వంటివాటిని సంకేతాలుగా భావిస్తున్నట్టు సమాచారం.
దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం.. కిమ్ జోంగ్ ఉన్కు ముగ్గురు సంతానం. వారసురాలిగా భావిస్తున్న కిమ్ జు యే రెండో కుమార్తె కాగా.. ఆమెకు 13 ఏళ్లు. ఉత్తర కొరియాలో కుటుంబపాలన కొనసాగుతోంది. తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ మరణాననంతరం కిమ్ జోంగ్ ఉన్ పగ్గాలు చేపట్టారు. ఈ నెలాఖరులో అధికార వర్కర్స్ పార్టీ సమావేశం జరగనుంది. ఇదే వేదికగా కిమ్ తన వారసురాలి నియమాకంపై పార్టీపరంగా ఆమోదముద్ర వేయించుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వర్కర్స్ పార్టీ నిబంధనల ప్రకారం భ్యులు కనీసం 18 ఏళ్లు నిండాలి.. కానీ, పార్టీ నంబర్ 2 పదవి అయిన సెంట్రల్ కమిటీకి ఆమెను మొదటి కార్యదర్శిగా నియమించవచ్చని కొందరు భావిస్తున్నారు. కిమ్ జుయే కుమ్సుసన్ సందర్శన వారి కుటుంబ పాలనకు సంకేతమని దక్షిణ కొరియాలోని సెజాంగ్ ఇన్స్టిట్యూట్కు చెందిన చియోంగ్ సియోంగ్-చాంగ్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
