US: బైడెన్ విజయావకాశాలు సంక్లిషమన్న ఒబామా!

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోనుంచి వైదొలగాలని బైడెన్పై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే అనేకమంది సొంత పార్టీ నేతలు ఈ విషయాన్ని వెల్లడించగా.. తాజాగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో విజయావకాశాలు తగ్గిపోయానని, పోటీపై తిరిగి పునరాలోచించుకోవాలని తన మిత్రులతో చెప్పినట్లు వాషింగ్టన్ పోస్టు కథనం వెల్లడించింది. డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నేత, మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా బైడెన్పై నేరుగా అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ట్రంప్ను ఓడించలేరన్న విషయాన్ని ఎన్నికల సూచీలు వెల్లడిస్తున్నాయని, 81 ఏళ్ల బైడెన్ కనుక అధ్యక్ష రేసులో కొనసాగితే ప్రతినిధుల సభలో కూడా డెమోక్రాట్ల అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆమె ఆందోళన వ్యక్తం చేసినట్లు అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి. ఇదే సమయంలో ఒబామా కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ట్రంప్కు పెరుగుతున్న మద్దతు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటన జరిగిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు మద్దతు ఇచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో పాల్గొన్న రిపబ్లికన్లు.. వినూత్న రీతిలో ఆయనకు మద్దతు తెలిపారు. తమ కుడి చెవికి తెల్లటి బ్యాండేజీలను కట్టుకుని సంఘీభావం తెలియజేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ పేరుకు ఇప్పటికే ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో విస్కాన్సిన్లోని మిల్వాకీలో ఇటీవల జరిగిన జాతీయ సదస్సుకు ట్రంప్ హాజరయ్యారు. అక్కడికి విచ్చేసిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. అప్పుడు చెవికి బ్యాండేజీతో కనిపించారు. అదే సమయంలో అక్కడున్న చాలా మంది చెవులకు తెల్ల బ్యాండేజీ కట్టుకుని మద్దతు తెలియజేశారు.
పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతుండగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో ఆయన కుడి చెవికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత ట్రంప్నకు విజయావకాశాలు భారీగా పెరిగినట్లు నివేదికలు వెల్లడించాయి. ప్రజల్లో మద్దతు ఒక్కసారిగా 8 శాతం పెరిగినట్లు పేర్కొన్నాయి. ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచేందుకు 70శాతం అవకాశాలున్నట్లు అంచనా వేసింది. ఈ క్రమంలోనే తాజాగా చెవికి బ్యాండేజీలతో ట్రంప్నకు మద్దతు తెలపడం ఆసక్తికరంగా మారింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్పై కాల్పుల కేసులో ఎఫ్బీఐ చేతికి కీలక ఆధారం లభించింది. నిందితుడు థామస్ మాథ్యూ క్రూక్స్ ఈ ఘటన కంటే కొన్నాళ్ల ముందే ఏదో పెద్దది జరగబోతున్నట్లు నర్మగర్భ పోస్టు చేశాడు. ఎఫ్బీఐ అధికారులు సెనెటర్లకు ఇచ్చిన వివరణలో ఈ విషయం వెల్లడైంది. నిందితుడు గేమింగ్ ప్లాట్ఫామ్ ‘స్టీమ్’లో ‘జులై 13న నా తొలి అడుగు. అది ఆవిష్కృతమవుతున్నప్పుడు వీక్షించండి’ అని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఫాక్స్ న్యూస్ పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com