పబ్‌ జీ ఆడుతూ ప్రేమించింది.. న‌లుగురు పిల్ల‌ల‌తో సహా భార‌త్‌ వ‌చ్చేసింది

పబ్‌ జీ ఆడుతూ ప్రేమించింది.. న‌లుగురు పిల్ల‌ల‌తో సహా భార‌త్‌ వ‌చ్చేసింది
ప్రేమికుడి కోసం నలుగురు పిల్లలతో సహా భారత్‌ వచ్చేసిన పాక్ మహిళ... చాలా రోజులుగా సహజీవనం చేస్తున్న జంట... అదుపులోకి తీసుకున్న పోలీసులు...

పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళకు పబ్‌జీ ఆటంటే పిచ్చి. ఆన్‌లైన్‌లో గేమ్ ఆడుతుండగా నోయిడాకు చెందిన కుర్రాడితో పరిచయమైంది. ఆ పరిచయం స్నేహంగా.. ఆ స్నేహం ప్రేమగా మారేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. అప్పటికే ఆ మహిళకు పెళ్లై నలుగురు పిల్లలున్నా సరే ఆ కుర్రాడితోనే కలిసి బతకాలని గట్టిగా నిర్ణయించుకుంది. అనుకున్నదే తడువుగా నలుగురు పిల్లలతో కలిసి నేపాల్‌ నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. ఉత్తరప్రదేశ్‌ నుంచి బస్‌లో గ్రేటర్‌ నోయిడాలో దిగి ప్రేమికుడిని కలుసుకుంది. అనంతరం వీరిద్దరూ కలిసి తమకు పెళ్లైందని అబద్దం చెప్పి ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం కూడా పెట్టేశారు. చాలారోజులు ఈ వ్యవహారం నడిచింది. అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.


నోయిడాలోని రబూపురకు చెందిన సచిన్‌ ఆన్‌లైన్‌ పబ్‌జీకి బానిసయ్యాడు. అలా ఆడే క్రమంలో పాకిస్థాన్‌ మహిళ సీమ గులాం హైదర్‌తో పరిచయమైంది. అనంతరం వీరిద్దరూ తరచూ మాట్లాడుకునే వాళ్లు. ఆ చనువు కాస్తా ప్రేమగా మారింది. ఇక ప్రేమికుడి విరహం భరించలేక మే 13న ఆ పాకిస్థాన్ మహిళ ఇల్లు వదిలి నలుగురు పిల్లల్ని తీసుకుని బార్డర్ దాటి ఇండియాకు వచ్చేసింది. గ్రేటర్ నోయిడాలోనే సచిన్‌తో పాటు కొన్నాళ్లుగా సహ జీవనం చేస్తోంది. కుటుంబ సభ్యులు కూడా సచిన్‌ను కలిసేందుకు వచ్చేవారని స్థానికులుతెలిపారు. పాకిస్థానీ మహిళ తన భార్య అని, పిల్లలు కూడా ఉన్నారని అందరినీ సచిన్‌ అందరినీ నమ్మించాడు. ఈ విషయం ఆనోటా ఈనోటా పడి పోలీసులకు చేరింది. వెంటనే ఈ ప్రేమ జంట పరారైంది. వీరి కోసం మూడు టీమ్స్ గాలించాయి.

పాకిస్థాన్ మహిళ అక్రమంగా భారత్‌లో నివాసం ఉంటోందని తెలిసి అధికారులు, పోలీసులు అప్రమత్తం అయ్యారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన అనంతరం సీమను అదుపులోకి తీసుకుని ఆమె ప్రేమికుడి వివరాలు రాబట్టారు. ఆ సమాచారంతో ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు గ్రేటర్ నోయిడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాద్ మియాఖాన్ వెల్లడించారు. పబ్‌జీ ద్వారా సచిన్‌తో పరిచయమైందని ఆమె పోలీసులకు చెప్పింది. దీనిపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు డీసీపీ తెలిపారు. అయితే ఈ సంఘటనలో ఏదైనా కుట్ర కోణం ఉందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. దేశంలో ఏదైనా ఉగ్ర దాడులు చేసేందుకు మహిళను ఉపయోగించుకుంటున్నారా అన్న అనుమానంతోనూ విచారణ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story