Ceasefire: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య తక్షణ కాల్పుల విరమణ..

ఎట్టకేలకు పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ దేశాలకు టర్కీ మధ్యవర్తిత్వం వహించింది. దోహాలో జరిగిన చర్చల సందర్భంగా వారం రోజుల భీకర సరిహద్దు ఘర్షణలను బ్రేక్ పడింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం తెల్లవారుజామున ప్రకటించింది. రాయిటర్స్ ప్రకారం.. కాల్పుల విరమణ సక్రమంగా అమలు చేసేలా చూసుకోవడానికి రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు నిర్వహించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని ఖతార్ తెలిపింది. సరిహద్దులో ఇటీవల జరిగిన పోరాటంలో అనేక మంది మరణించగా, వందలాది మంది గాయపడిన తర్వాత ఈ చర్చలు జరిగాయి. 2021లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు పొరుగు దేశాల మధ్య జరిగిన అత్యంత తీవ్రమైన ఘర్షణ ఇది.
కాబూల్ ప్రతినిధి బృందానికి రక్షణ మంత్రి ముల్లా ముహమ్మద్ యాకూబ్ నాయకత్వం వహించారని, పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాలిబాన్ ప్రతినిధులతో చర్చలలో పాల్గొన్నారని ఆఫ్ఘన్ అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి పాకిస్థాన్లోకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపడం, పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడం ఈ చర్చల ప్రధాన లక్ష్యం అని పాక్ విదేశాంగ కార్యాలయం పేర్కొంది. కానీ.. ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ పాటిస్తుందా..? ఎప్పటి లాగానే విరమణను ఉల్లంఘిస్తుందా..? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ఎందుకంటే.. పాకిస్థాన్కి నమ్మక ద్రోహం చేయడం అలవాటే.. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకుంటుంది దాయాది దేశం. గతంలో భారత్- పాక్ మధ్య ఘర్షణలు జరిగినప్పుడు కాల్పులు విరమణ ఒప్పందం కుదిరిన తరువాత కూడా ఉల్లంఘించి దాడులు జరిపింది. భారత్ దాడులకు తట్టుకోలేక.. మమ్మల్ని కాపాడండి అంటూ.. కాల్పుల విరమణ కోసం ఇతర దేశాలకు మొరపెట్టుకుంది. తీరా ఒప్పందం జరిగిన వెంటనే దాన్ని ఉల్లంఘించి దొడ్డిదారిన దాడులు చేసింది. ఇటీవల ఆఫ్ఘనిస్థాన్తో సైతం అదే వైఖరిని అవలంబించింది. 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన గంటల్లోనే దాన్ని ఉల్లంఘించింది. ఆఫ్ఘన్పై వైమానిక దాడులు జరిపి ముగ్గురు క్రికెటర్లను సైతం పొట్టనపెట్టుకుంది. దీంతో మరోవైపు తాలిబన్ సైన్యం ఆగ్రహానికి గురవుతోంది. పాక్ ఉల్లంఘణను తిప్పికొట్టేందుకు యత్నిస్తోంది.
వాస్తవానికి.. ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వే పాకిస్థాన్ ఇటీవల ఆఫ్ఘన్లోని కాబుల్పై దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా ఆఫ్ఘన్ రెచ్చిపోయింది. పాక్ సరిహద్దుల వెంట కాల్పులు జరిపి చాలా మంది పాక్ సైనికులను మట్టుబెట్టింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గే అవకాశం లేకపోవడంతో, పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చింది. వెంటనే రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయాలని ఖతార్, సౌదీ అరేబియాలకు అక్టోబర్ 15న పాకిస్థాన్ ఫోన్ చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఎలాగోలా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కాళ్ల బేరానికి వచ్చిన పాక్.. దొడ్డి దారిన రెచ్చిపోయి దాడులు చేయడం ఆగ్రహాన్ని రేకిత్తిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com