Pakistan: రగిలిపోతున్న పాకిస్తాన్.. ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది మృతి

ఆర్మీకి ‘‘షూట్ అట్ సైట్’’ ఆర్డర్స్ జారీ..

మాజీ ప్రధాని, తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతుదారుల ఆందోళనతో పొరుగుదేశం పాకిస్థాన్‌ అట్టుడుకుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులు రాజధాని ఇస్లామాబాద్ మార్చ్‌కి పిలుపునిచ్చారు. జైల్లో ఉన్న మాజీ ప్రధానిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పీటీఐ కార్యకర్తలు లక్షలాది మంది ఇస్లామాబాద్‌ వైపు మార్చ్‌ నిర్వహించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ భార్య బుష్రా బీబీ , ఖైబర్‌ పఖ్తుంఖా ముఖ్యమంత్రి అలీ అమీన్‌ ఈ కవాతుకు నేతృత్వం వహించారు.

ఈ మార్చ్‌ సందర్భంగా రాజధానిలో ఉద్రిక్తతత చోటు చేసుకుంది. లక్షలాదిగా తరలివస్తున్న నిరసనకారులను పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్దీ పోలీసులు గాయపడ్డారు. ఇమ్రాన్ మద్దతుదారుల నిరసనలతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బానిసత్వ సంకెళ్లను తెంచేందుకు చేస్తున్న ఈ నిరసన కవాతులో ప్రజలు పాల్గొనాలని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ పీటీఐ పిలుపునిచ్చింది.

ఇమ్రాన్‌ ఖాన్‌తో పాటు తమ పార్టీ ఇతర నాయకులను జైళ్ల నుంచి విడుదల చేయాలని, ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ నుంచి దొంగిలించిన మెజారిటీని పునరుద్ధరించాలని, ఉన్నత స్థాయి జడ్జీల నియామకంలో చట్టసభల సభ్యులకు గల అధికారులను పునరుద్ధరించాలని పీటీఐ డిమాండ్‌ చేసింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం భద్రతా చర్యలు చేపట్టింది. ఇస్లామాబాద్‌లో ఆదివారం భారీగా భద్రతా దళాలను మోహరించింది. రోడ్లను మూసివేసి, మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను నిలిపేసింది.

నిరసనకారులు రాజధానిలోకి ఎంటర్‌ కాకుండా ప్రభుత్వం హైవేలను సైతం మూసివేసింది. రహదారులకు అడ్డంగా కంటెయినర్లు, కాంక్రటీట్‌ పరికరాలు, బారికేడ్లు ఏర్పాటు చేసింది. అయితే, నిరసనకారులు వాటిని తొలగించి ముందుకు చొచ్చుకొచ్చారు. ఇది హింసాత్మక ఘటనలను దారితీసింది. ఫలితంగా ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

ఇస్లామాబాద్‌ సమీపంలో, పంజాబ్‌ ప్రావిన్స్‌ అంతటా జరిగిన ఘర్షణల్లో కనీసం 119 మంది గాయడప్డారు. 22 పోలీసు వాహనాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. ఇద్దరు అధికారుల పరిస్థితి విషమయంగా ఉన్నట్లు ప్రావిన్షియల్‌ పోలీసు చీఫ్‌ ఉస్మాన్‌ అన్వర్‌ తెలిపారు. ఈ హింసాత్మక ఘటనల్లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులకు కూడా గాయాలైనట్లు వెల్లడించారు. ప్రస్తుతం పాక్‌లో హైటెన్షన్‌ కొనసాగుతోంది.

పాకిస్తాన్‌లో నిరసనకారులు పోలీసులు హెచ్చరికల్ని ధిక్కరించి, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వేల సంఖ్యలో ప్రజలు కర్రలు, రాళ్లతో ఇస్లామాబాద్ వీధుల్లోకి వచ్చారు. ఇస్లామాబాద్ శనివారం నుండి లాక్‌డౌన్లో ఉంది. రోడ్లపై అడ్డంగా కంటైనర్లను ఉంచారు. వేల సంఖ్యలో పోలీసులు, సైన్యం మోహరించింది. ఇంటర్నెట్ ని కట్ చేశారు. ఇస్లామాబాద్‌లో రెండు నెలల పాటు అన్ని బహిరంగ సభల్ని ప్రభుత్వం నిషేధించింది.

Tags

Next Story