Italy : పెళ్లికి నిరాకరించిన కుమార్తెను హత్య

Italy :   పెళ్లికి నిరాకరించిన కుమార్తెను హత్య
X
దంపతులకు జీవిత ఖైదు

పెళ్లికి నిరాకరించిందనే కారణంతో కుమార్తెను దారుణంగా హత్య చేయించిన పాకిస్థానీ దంపతులకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ ఘటన ఇటలీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

సమన్ అబ్బాస్ అనే 18 సంవత్సరాల యువతి ఇటలీలోని బోలోగ్నా సమీపంలోని నోవెల్లారాలో నివసిస్తున్నారు.ఆమె మే 2021లో కనిపించకుండా పోయారు. గత సంవత్సరం ఆమె పాకిస్తాన్‌లోని బంధువును వివాహం చేసుకోవాలని కుటుంబం చెప్పగా అందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో కూతురుని చంపాలని తల్లిదండ్రులే చెప్పగా మేనమామ మేనకోడలిని గొంతు కోసి చంపాడని సెంట్రల్ ఇటలీలోని రెజియో ఎమిలియాలోని ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఘటనలో ఇద్దరు బంధువులు నిర్దోషులుగా విడుదల కాగా, బేరసారాన్ని అంగీకరించిన తర్వాత మామకు 14 సంవత్సరాల శిక్ష విధించబడింది.

అబ్బాస్ ఆమె తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక కార్యకర్తలు ఆమెను నవంబర్ 2020లో ఆశ్రమంలో ఉంచారు. కానీ, ఆమె ఏప్రిల్ 2021లో తన కుటుంబం దగ్గరికి వెళ్లారు. తన పాస్‌పోర్ట్‌ని తీసుకొని, తన కుటుంబం అంగీకరించని ప్రియుడితో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. అనంతరం ఆమె అదృశ్యమయ్యారు. ప్రియుడు ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు మేలో యువతి కుటుంబ ఇంటిపై దాడి చేశారు.

కానీ, ఆమె తల్లిదండ్రులు అప్పటికే పాకిస్తాన్‌కు వెళ్లిపోయారు. ఏప్రిల్ 30, మే 1 మధ్య రాత్రి బహుశా యువతి హత్య గావించబడినట్లు అనుమానిస్తున్నారు. రెండున్నర గంటల తర్వాత ఐదుగురు వ్యక్తులు గడ్డపారలు, బకెట్లతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు నిఘా కెమెరా ఫుటేజ్ లో రికార్డు అయింది. సంవత్సరం తర్వాత అబ్బాస్ మృతదేహం పాడుబడిన ఫామ్‌హౌస్‌లో మెడ విరిగిన స్థితిలో కనిపించింది. హత్య గురించి తన తండ్రి మాట్లాడడం విన్నానని, సోదరిని చంపింది తన మామ అని ఆమె సోదరుడు పోలీసులకు చెప్పాడు. యువతి తండ్రి షబ్బర్ అబ్బాస్‌ను పాకిస్థాన్‌లో అరెస్టు చేసి 2023 ఆగస్టులో ఇటలీకి తీసుకొచ్చారు. యువతి బంధువులను స్పెయిన్‌లో అరెస్టు చేశారు. నలుగురు వ్యక్తులు పోలీసుల విచారణకు హాజరయ్యారు. కానీ, యువతి తల్లి నాజియా షాహీన్ ఇప్పటికీ పరారీలో ఉన్నారు.

Tags

Next Story