Pakistan: అదిరిపోయిన భారత్ దెబ్బ పాక్‌లో పరిస్థితి ఎలా ఉందంటే..

Pakistan: అదిరిపోయిన భారత్ దెబ్బ  పాక్‌లో పరిస్థితి ఎలా ఉందంటే..
X
సింధు జలాల ఒప్పందం రద్దుతో పెరిగిన ఇబ్బందులు..

పాకిస్తాన్‌కి కొత్త సంక్షోభం వచ్చి పడింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, తిరుగుబాటు, ఉగ్రవాదంతో సతమతం అవుతున్న ఆ దేశాన్ని ఇప్పుడు ‘‘నీటి సంక్షోభం’’ భయపెడుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ 1960 నాటి ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది. దీని ప్రభావం ప్రస్తుతం పాకిస్తాన్ లో స్పష్టంగా కనిపిస్తోంది. సింధు, జీలం, చీనాబ్ నదులతో కూడిన సింధు నది వ్యవస్థలో నీటి కొరత కనిపిస్తోంది. పంజాబ్ ప్రావిన్స్‌లో ఖరీఫ్(వానాకాలం పంటల) విత్తే కాలం దగ్గర పడుతున్న నేపథ్యంలో నీటి సమస్య తీవ్రమైంది.

పాకిస్తాన్ ‌లోని రెండు ముఖ్యమైన ఆనకట్టలు సింధు నదిపై ఉన్న తర్బెలా, జీల్ నదిపై ఉన్న మంగ్లాలో నీరు తగ్గపోతున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. తీవ్రమైన వేడి వాతావరణం నీటి కొరతకు ఒక కారణం కాగా, ఇక చీనాబ్ నది నీటిని భారత్ సమర్థవంతంగా అడ్డుకోవడంతో పాకిస్తాన్ కష్టాలు మరింత పెరిగాయి. పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, జూన్ 02, 2025 నాటికి సింధు నదీ వ్యవస్థలో (పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోపల) నీటి లభ్యత 2024 జూన్ 02తో పోలిస్తే 10.3 శాతం తగ్గింది. నైరుతి రుతుపవనాలు ప్రారంభానికి ఇంకా కనీసం నాలుగు వారాల సమయం ఉన్నందున రాబోయే వారాల్లో ఈ పరిస్థితి మరింత దిగజారవచ్చని తెలుస్తోంది.

సింధు నదీ వ్యవస్థ అథారిటీ (IRSA) ప్రకారం, జూన్ 2, 2025 నాటికి పంజాబ్ ప్రావిన్స్‌లో మొత్తం నీటి లభ్యత కేవలం 1,28,800 క్యూసెక్కులు, ఇది గత సంవత్సరం అదే నెలలో అందుబాటులో ఉన్న నీటి కంటే 14,800 క్యూసెక్కులు తక్కువ. ఖరీఫ్ విత్తే కాలం ప్రారంభమైనందున, నైరుతి రుతుపవనాలు జూన్ చివరి నాటికి పంజాబ్ ప్రావిన్స్ చేరుకునే అవకాశం లేకపోవడంతో నీటి కొరత ఆ దేశ రైతులకు పెద్ద విపత్తగా మారొచ్చు.

గత నెలలో పాకిస్తాన్ ఈ వేసవిలో 21 శాతం నీటి కొరత ఉంటుందని అంచనా వేసింది. దీంతో నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని అక్కడి అధికారులు సూచించారు. పాకిస్తాన్ పంజాబ్, సింధ్ ప్రావిన్సులకు కీలకమైన రెండు ప్రాజెక్టుల్లో ప్రత్యక్ష నిల్వలో 50 శాతం నీటి కొరత ఉంటుందని ఇస్లామాబాద్ కూడా అంచనా వేసింది. గత వారం తజకిస్తాన్ పర్యటనకు వెళ్లిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సింధు జలాలపై ఆందోళన వ్యక్తం చేశారు.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేసింది. భారత ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. ‘‘నీరు, రక్తం కలిసి ప్రవహించదు’’ అని స్పష్టం చేశారు. పాక్ ఉగ్రవాదాన్ని ఆపితేనే నీటిని విడుదల చేస్తామని చెప్పకనే చెప్పారు. 1960 నాటి సింధు జలాల ఒప్పందంపై భారత్‌దే తుది నిర్ణయం కాబట్టి పాకిస్తాన్‌లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది.

ఈ ఒప్పందం పశ్చిమ నదులను (సింధు, జీలం, చీనాబ్) పాకిస్తాన్‌కు మరియు తూర్పు నదులను (రవి, బియాస్, సట్లెజ్) భారతదేశానికి కేటాయిస్తుంది. అదే సమయంలో ఇరు దేశాలు నీటి మట్టాలు, ప్రాజెక్టుల వివరాలు ఇచ్చిపుచ్చుకోవాలి. అయితే, ప్రస్తుతం భారత్ ఒప్పందం నిలిపేయడంతో పాకిస్తాన్‌తో ఎలాంటి డేటా పంచుకోవడం లేదు. భారత్ నీటి మట్టాల గురించి ముందస్తు సమాచారం ఇవ్వకపోతే, పాకిస్తాన్‌కి కరువు, వరద పరిస్థితులపై అవగాహన ఉండదు. ఫలితంగా వర్షాకాలంలో వరదలు సంభవిస్తే పాక్ తీవ్రంగా నష్టపోవడం ఖాయం.

Tags

Next Story