Imran Khan: తోషఖానా-2 కేసులో ఇమ్రాన్, ఆయన భార్యకు 17 ఏళ్ల జైలు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు న్యాయస్థానంలో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తీవ్ర సంచలనం సృష్టించిన తోషఖానా-2 అవినీతి కేసులో ఆయనకు, ఆయన భార్య బుష్రా బీబీకి ప్రత్యేక కోర్టు 17 ఏళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధించింది. అధికారంలో ఉన్నప్పుడు సౌదీ ప్రభుత్వం నుంచి అందిన ఖరీదైన బహుమతులను ప్రభుత్వ ఖజానాలో జమ చేయకుండా, తక్కువ ధరకు అక్రమంగా సొంతం చేసుకున్నారన్న ఆరోపణలు ఈ కేసులో రుజువయ్యాయి.
రావల్పిండిలోని అడియాలా జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి షారుఖ్ అర్జుమంద్ ఈ తీర్పును వెలువరించారు. నేరపూరిత విశ్వాసఘాతుకానికి పాల్పడినందుకు 10 ఏళ్లు, అవినీతి నిరోధక చట్టం కింద మరో 7 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు. దీంతో పాటు ఇద్దరికీ చెరో రూ. 1.64 కోట్ల జరిమానా కూడా విధించారు. ఇమ్రాన్ ఖాన్ వయసు, బుష్రా బీబీ మహిళ కావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కాస్త తక్కువ శిక్ష విధించినట్లు తీర్పులో పేర్కొన్నారు.
2022 ఏప్రిల్లో అధికారం కోల్పోయినప్పటి నుంచి 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ డజన్ల కొద్దీ కేసులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 2023 ఆగస్టు నుంచి ఆయన అడియాలా జైలులోనే ఉంటున్నారు. ఈ తాజా తీర్పుతో ఆయనపై ఉన్న కేసుల సంఖ్య, శిక్షల కాలం మరింత పెరిగింది.
ఇదిలా ఉండగా, ఈ శిక్షతో పాటు ఇతర కేసులకు సంబంధించి దాఖలైన 13 పిటిషన్లను ఫిబ్రవరి 9న విచారించేందుకు పాకిస్థాన్ సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేసేందుకు ఇమ్రాన్ దంపతులకు అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
