Shehbaz Sharif: పాక్ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా షెహ‌బాజ్‌, ముఖ్యమంత్రి అభ్యర్థిగా మరియం నవాజ్‌

Shehbaz Sharif: పాక్ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా షెహ‌బాజ్‌, ముఖ్యమంత్రి అభ్యర్థిగా  మరియం నవాజ్‌
పాకిస్థాన్ రాజకీయాల్లో సంచలనం..

నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌- నవాజ్‌పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రధాని అభ్యర్థిగా షెహబాజ్‌ షరీఫ్‌ను నామినేట్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి మారియం ఔరంగజేబు సామాజిక మధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. తమ పార్టీ అధినేత నవాజ్‌ షరీఫ్‌ షెహబాజ్‌ షరీఫ్‌ను ప్రధాని పదవికి నామినేట్‌ చేశారని తెలిపారు. నవాజ్‌ షరీఫ్‌ కూతురు మరియం నవాజ్‌ను పంజాబ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. పీఎంఎల్​-ఎన్ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన రాజకీయ పార్టీలకు మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్​ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి నిర్ణయాల వల్ల సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ను, గాడిన పెట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక నవాజ్​ షరీఫ్​ చిన్న తమ్ముడైన 72 ఏళ్ల షెహబాజ్‌ షరీఫ్‌కు పాక్​ ప్రధానిగా పనిచేసిన అనుభవం ఉంది.

పాకిస్థాన్‌లో తాజాగా ముగిసిన జాతీయ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌తిష్టంభ‌న ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాక‌పోవ‌డంతో అయోమ‌య ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. ఈ నేప‌థ్యంలో మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌కు చెందిన పీఎంఎల్‌-ఎన్ పార్టీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆరు పార్టీలు అంగీక‌రించాయి. అయితే ప్ర‌ధాని అభ్య‌ర్థిగా షెహ‌బాజ్ ష‌రీఫ్‌(Shehbaz Sharif)ను నియ‌మిస్తూ పీఎంఎల్‌-ఎన్ పార్టీ అధినేత న‌వాజ్ ష‌రీఫ్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే పీటీఐలో ఉన్న రెబ‌ల్స్‌ను ఆరు పార్టీల కూట‌మి ఆహ్వానించింది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఇమ్రాన్ మ‌ద్ద‌తుదారులు 92 స్థానాల్లో గెల‌వ‌గా, పీఎంఎల్‌- పార్టీ 79, పీపీపీ 54 సీట్ల‌ను గెలుచుకున్న‌ది.

అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని తమ పార్టీ సాధించలేకపోవడం వల్ల ప్రధాని రేసు నుంచి తప్పుకుంటున్నట్లు పాకిస్థాన్ పీపుల్స్‌ పార్టీ-పీపీపీ ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో జర్దారీ తెలిపారు. దేశంలో రాజకీయ సుస్థిరత కోసం నూతన ప్రభుత్వంలో తమ పార్టీ భాగమవ్వకుండానే పీఎంఎల్‌-ఎన్‌కు చెందిన ప్రధాన మంత్రి అభ్యర్థికి మద్దతు పలకాలని నిర్ణయించినట్లు తెలిపారు. తమ పార్టీతో కలిసి సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు పీటీఐ పార్టీ నిరాకరించడం వల్లే పీఎంఎల్​-ఎన్​ వైపు మొగ్గు చూపామని పేర్కొన్నారు. భుట్టో పార్టీకి దేశ అధ్యక్ష పదవి, జాతీయ అసెంబ్లీ స్పీకర్‌, సెనేట్‌ ఛైర్మన్‌ సహా కీలక పదవులు కట్టబెట్టే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story