Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. పాక్ దౌత్యవేత్తకు కేంద్రం సమన్లు

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై భారత్ దౌత్యపరమైన చర్యలు మరింత వేగం చేసింది. ఇప్పటికే దేశంలోకి పాకిస్థానీయులకు ప్రవేశంపై నిషేధం విధించడంతోపాటు సిధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన కేంద్రం.. తాజాగా ఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు సమన్లు జారీచేసింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్థాన్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైచ్ను పిలిపించి పాక్ మిలిటరీ దౌత్యవేత్తలకు ‘పర్సోనా నాన్ గ్రాటా’ అధికారిక నోటీసులు అందించింది. అయిష్టమైన వ్యక్తులుగా పేర్కొనేందుకు ఈ నోటీసులు జారీచేస్తారు. దీనిప్రకారం వారు వారం రోజుల్లోగా భారత్ను వీడాల్సి ఉంటుంది. ఈమేరకు విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి.
పహల్గాంలో మంగళవారం పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల ఫొటోలు, ఊహాచిత్రాలను దర్యాప్తు సంస్థలు బుధవారం విడుదల చేశాయి. ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు అసువులు బాయగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను ఆసిఫ్ ఫుజీ, సులేమాన్ షా, అబూతల్హాగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. వీరంతా నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా అనుబంధ గ్రూపు రెసిస్టెన్స్ ఫ్రంట్ సభ్యులని తెలుస్తున్నది. సైనిక దుస్తులు, కుర్తా పైజామాలు ధరించి వచ్చిన ఐదారుగురు ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్టు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం బైసరాన్ పచ్చిక బయలుకు చేరువలో ఉన్న దట్టమైన పైన్ అడవుల్లో నుంచి అకస్మాత్తుగా వచ్చిన ఉగ్రవాదులు ఏకే 47 రైఫిల్స్తో పర్యాటకులపై కాల్పులు జరిపి వచ్చిన మార్గంలోనే తప్పించుకు పారిపోయారు. దాడికి కొన్ని రోజుల ముందే ఈ గ్రూపుసహా పలువురు పాకిస్థానీ ఉగ్రవాదులు కశ్మీరులోకి చొరబడినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి.
కాగా, పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై దౌత్యపరమైన చర్యలను భారత ప్రభుత్వం బుధవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్థానీ జాతీయులకు భారత్లో ప్రవేశంపై నిషేధం విధించడం వంటి ఐదు అంశాలతో కూడిన చర్యలను భారత్ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం భద్రతా వ్యవహారాలకు సంబంధించిన క్యాబినెట్ కమిటీతో సమావేశమై పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిస్థితిని సమీక్షించారు. సమావేశం అనంతరం భారత ప్రభుత్వం పాకిస్థాన్పై చేపట్టిన ఐదు చర్యలను ప్రకటించింది.
1960లో పాక్తో కుదుర్చుకున్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలుపుదల చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. సీమాంతర ఉగ్రవాదానికి అందచేస్తున్న మద్దతును నిలిపివేస్తున్నట్లు పాక్ నుంచి స్పష్టమైన, విశ్వసనీయమైన ప్రకటన వెలువడే వరకు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అటారీ-వాఘా సరిహద్దు చెక్పోస్టును వెంటనే మూసివేస్తున్నట్లు తెలిపింది. చట్టబద్ధమైన పత్రాలతో భారత్లోకి ప్రవేశించిన పాకిస్థానీ పౌరులు మే 1వ తేదీలోగా ఈ మార్గంలో తిరిగి వెళ్లిపోవచ్చని భారత్ ప్రకటించింది.
సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్థానీ జాతీయులు భారత్లో ప్రయాణించడానికి అనుమతించబోమని ప్రభుత్వం ప్రకటించింది. పథకం కింద గతంలో పాకిస్థానీ జాతీయులకు జారీ చేసిన వీసాలు రద్దయినట్లేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం కింద వీసా తీసుకుని ప్రస్తుతం భారత్లో ఉన్న పాకిస్థానీ జాతీయులు 48 గంటల్లోగా భారత్ను వీడాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇస్లామాబాద్లోని భారతీయ హై కమిషన్ నుంచి తన రక్షణ, నౌకాదళ, వైమానిక సలహాదారులను ఉపసంహరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అదే విధంగా ఢిల్లీలోని పాకిస్థానీ హై కమిషన్లో ఉన్న ఆ దేశ సైనిక, నౌకాదళ, వైమానిక సలహాదారులు వారం రోజుల్లోగా భారత్ను వీడాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. భారత్లోని పాక్ హై కమిషన్లలోని దౌత్యాధికారుల సంఖ్యను ప్రస్తుతమున్న 55 నుంచి 30కి తగ్గించాలని పాకిస్థాన్ను ఆదేశించినట్టు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com