Modi on sunita williams: భూమి మిమ్మల్ని చాలా మిస్సయ్యింది..

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపైకి తిరిగొచ్చారు. దాదాపు 9 నెలలపాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆమె బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో దిగారు. వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరడంతో ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత పుడమికి చేరిన వారికి యావత్తు ప్రపంచం వెల్కమ్ చెప్పింది.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం సునీత విలియమ్స్ రాకపై స్పందించారు. ఈ మేరకు సునీత బృందానికి వెల్కమ్ చెబుతూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘వెల్ కమ్ బ్యాక్.. క్రూ9..! భూమి మిమ్మల్ని మిస్ అయింది. మీ అపరిమిత ధైర్యం, స్ఫూర్తికి ఇన్నాళ్లూ పరీక్ష ఎదురైంది. సునీతా విలియమ్స్, క్రూ9 వ్యోమగాములు మరోసారి వారి పట్టుదల ఏంటో అందరికీ చూపించారు. క్లిష్టమైన, అనిశ్చిత పరిస్థితుల్లో అచంచలమైన సంకల్పంతో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. లక్షల మందిలో స్ఫూర్తి నింపారు.
అంతరిక్ష పరిశోధన అంటే మానవ సామర్థ్యాన్ని పెంచడం, కలలు కనడానికి ధైర్యం చేయడం, ఆ కలలను వాస్తవంగా మార్చే దృఢ సంకల్పాన్ని కలిగి ఉండటం. ఒక మార్గదర్శకురాలు, ఐకాన్ అయిన సునీతా విలియమ్స్ తన కెరీర్ అంతటా ఈ స్ఫూర్తిని ప్రదర్శించారు. మీరు విజయవంతంగా భూమికి తిరిగి రావడాన్ని గర్వంగా భావిస్తున్నాం. వ్యోమగాముల సురక్షితమైన రాక కోసం అవిశ్రాంతంగా పనిచేసిన వారందరినీ చూసి మేము గర్విస్తున్నాము’ అని మోదీ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com