PM Modi: పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ.

రష్యా దండయాత్రతో గత రెండేళ్లకు పైగా యుద్ధ భూమిలో నలిగిపోతున్న ఉక్రెయిన్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఆగస్టు 23న ఆయన కీవ్ను సందర్శిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇది ఎంతో ప్రాధాన్యత కలిగిన పర్యటన అని తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు భారత్ ఎల్లప్పుడూ దౌత్యం, చర్చలను సమర్థిస్తుందని స్పష్టం చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటన చేపటనున్నారు. ఈ నెల 21న పోలాండ్లో పర్యటించనున్నారు. 45 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని పోలాండ్ పర్యటనకు వెళ్తుండడం విశేషం. యూరప్లోని పోలాండ్ భారత్కు వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతున్నది. ఆ దేశానికి చెందిన 30 కంపెనీలు భారత్లో వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నది. ఆ దేశంలో భారత్కు చెందిన సుమారు 5వేల మంది సైతం విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. ఇక పోలాండ్ పర్యటన అనంతరం ప్రధారి ఉక్రెయిన్ వెళ్లనున్నారు. 23న ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీతో మోదీ భేటీ కానున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, యుద్ధం ఆపేలా రష్యాను ఒప్పించాలని ఉక్రెయిన్ భారత ప్రధానిని కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు నేతలు భేటీకానుండడం ప్రాధాన్యం సంతరించుకున్నది. అయితే, దాదాపు 30 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్లో పర్యటిస్తుండడం ఇదే తొలిసారి.
కస్క్ ప్రాంతంలో రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ బలగాలు చొచ్చుకుపోయిన వేళ, మాస్కో నుంచి అంత కంటే ఎక్కువ ప్రతిస్పందన ఎదురవుతోంది. తూర్పు ఉక్రెయిన్లోని పోక్రోవ్స్క్తో పాటు సమీప పట్టణాలకు రష్యా దళాలు వేగంగా దూసుకొస్తూ తీవ్ర దాడులను చేస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నగరాన్ని వీడి వెళ్లిపోయేందుకు కొన్ని రోజుల సమయమే ఉందని, పోక్రోవ్స్క్తోపాటు సమీప పట్టణాలపై రష్యా బలగాలు తీవ్రంగా దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు. చిన్నారులున్న కుటుంబాలు తప్పనిసరిగా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించారు.
మరోవైపు రష్యాలోని కస్క్ ప్రాంతంలో కిలోమీటర్ల కొద్దీ దూసుకెళ్లిన ఉక్రెయిన్ సైన్యం అక్కడే తిష్ఠవేసేలా యత్నిస్తోంది. అందుకే నదులపై ఉన్న వంతెలను ఉక్రెయిన్ సైన్యం ధ్వంసం చేసింది. తద్వారా రష్యా సైన్యానికి సరఫరా వ్యవస్థల్ని అడ్డుకోవడం, తమ సైనిక దళాలు అక్కడ మరింతగా తిష్ఠవేసేలా చూడడం ప్రస్తుతం తమ లక్ష్యమని ఉక్రెయిన్ భావిస్తోంది. ఇరుదేశాల సైన్యాల పరస్పర దాడులతో కస్క్ రీజియన్లో ఇప్పటికే లక్ష మందికిపైగా పౌరులను రష్యా సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com