London: అమెరికా ఎంబసీ ముందు పార్సిల్‌ కలకలం

London:  అమెరికా ఎంబసీ ముందు పార్సిల్‌ కలకలం
X
లండన్‌లో హైఅలర్ట్

బ్రిటన్ రాజధాని లండన్‌‌లో అమెరికా రాయబారి కార్యాలయం దగ్గర అనుమానాస్పద ప్యాకేజీ తీవ్ర కలకలం రేపింది. దీంతో యూకే పోలీసులు అప్రమత్తమై శుక్రవారం ప్యాకేజ్‌ను నిర్వీర్యం చేశారు. ప్యాకేజీ ఎక్కడినుంచి వచ్చిందనేదానిపై లండన్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అమెరికా ఎంబసీ వెల్లడించింది. మరోవైపు గాట్విక్‌ ఎయిర్‌పోర్టులో భద్రతాపరమైన ఘటన మరొకటి జరిగింది. దీంతో ఎయిర్‌పోర్టు దక్షిణ టెర్మినల్‌ను ఖాళీ చేయించామని అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే రష్యా- ఉక్రెయిన్‌ ల మధ్య యుద్ధం నేపథ్యంలో మాస్కో, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలోని డిఫెన్స్‌ కంపెనీలపై రష్యా దాడులు చేసే అవకాశముందని ఆ దేశ ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి.ఈ మేరకు నేషనల్‌ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఓ ప్రకటనను విడుదల చేసింది.

ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతల మధ్య ఇప్పటికే ఉక్రెయిన్‌లో యూఎస్ ఎంబసీ కార్యాలయాన్ని మూసివేసింది. అమెరికాతో పాటు ఇటలీ, స్పెయిన్ సహా పలు దేశాలు ఎంబసీలను మూసివేశాయి. ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌పై తాజాగా రష్యా అణు రహిత ఖండాంతర క్షిపణి ప్రయోగించింది. రెండేళ్ల యుద్ధంలో ఇలాంటి క్షిపణిని ప్రయోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇదిలా ఉంటే ఎలాంటి నష్టం వివరాలు ఇప్పటికి బయటకు రాలేదు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రష్యాకు ఉత్తర కొరియా అండగా నిలబడగా.. ఉక్రెయిన్‌కు అమెరికా.. నాటో దేశాలు మద్దతుగా నిలిచాయి. ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయోనని ప్రపంచ దేశాలు భయాందోళన చెందుతున్నాయి.

Tags

Next Story