నదిలో మునిగిన గ్రీస్ పడవ.. అత్యధికులు పాకిస్థానీలే

సుమారు 750 వలసదారులతో వెళ్తూ మధ్యధరా సముద్రంలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన వారిలో 300 మందికిపైగా పాకిస్థానీలే ఉన్నట్టు తాజా సమాచారం.
లిబియా నుంచి వలసదారులతో బయలుదేరిన ఈ పడవ బుధవారం బోల్తాపడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 79 మంది మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. 12 మంది పాకిస్థానీలు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ కనపడకుండా పోయిన వారు ఇంక బతికే అవకాశం లేకపోవడంతో ఇది బ్లాక్ డే గా పేర్కొంటున్నారు పాకిస్తానీలు. అంతేకాదు, ప్రమాదానికి గురైన బోటులో 200 మందికిపైగా చిన్నారులు కూడా ఉన్నారని, వారంతా అదృశ్యమైనట్టు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. మామూలుగా చేపలు పట్టే పడవల్లో 500 నుంచి 700 ప్రయాణించారు. పైలోస్ తీరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉండగానే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదంపై పాక్ ప్రధాని షేబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆచూకీ గల్లంతైన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించినవారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మూడు రోజులపాటు జాతీయ సంతాప దినాలుగా గ్రీస్ ఆపద్ధర్మ ప్రధాన మంత్రి ఐయన్నిస్ సర్మస్ ప్రకటించారు.మరోవైపు పాకిస్థాన్ జాతీయుల అక్రమ రవాణాకు కారకుడిగా భావిస్తున్న వ్యక్తిని కరాచీ ఎయిర్పోర్టులో అరెస్ట్ చేశారు . మెడిటెర్రేనియన్ సముద్రం 17000 అడుగుల లోతు ఉన్నప్రాంతంలో ఈ సంఘటన జరిగినందు వల్ల సహాయక చర్యలకు చాలా ఆటంకాలు ఏర్పడ్డాయ. పడవలో సమస్యను గుర్తించిన 10 నుంచి 15 నిమిషాల్లో అది పూర్తిగా మునిగిపోయిందని చెబుతున్నారు. గ్రీస్ ని దాటుకొని ఇటలీ చేరుకునేందుకు స్మగ్లర్లు ఎక్కువగా ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు. ఆసియా దేశాల్లో సంక్షోభం, హింస కారణంగా చాలా మంది పొట్టచేత పట్టుకుని యూరప్ దేశాలకు వలస వెళ్తున్నారు. ఇలా వలసవెళ్లేవారికి గ్రీస్ దేశం యూరప్ యూనియన్ లోకి గేట్ వేగా మారింది. ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం, ఈ ఏడాది ఇప్పటికే 70,000 కంటే ఎక్కువ మంది శరణార్థులు, వలసదారులు యూరప్ తీరంలోని దేశాలకు చేరుకున్నారు. ఎక్కువ మంది ఇటలీలో దిగారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com