Houthi Rebels: అమెరికా డ్రోన్ను కూల్చేసిన హూతీ తిరుగుబాటుదారులు

ఎర్ర సముద్రంలో హూతీ తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా అమెరికాకు చెందిన ఓ డ్రోన్ను క్షిపణులతో కూల్చారు. యెమెన్లోని హొడెయిడా తీరం నుంచి రాత్రి వేళ జరిపిన ఈ దాడి దృశ్యాలను.. హూతీ రెబెల్స్ విడుదల చేశారు.గతేడాది నవంబర్ నుంచి వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతున్న హూతీలు అమెరికా, బ్రిటన్లు యుద్ధనౌకలతో ఎర్ర సముద్రంలో గస్తీలు నిర్వహిస్తున్నా బెదరకుండా దాడులు కొనసాగిస్తున్నారు.
అమెరికా, బ్రిటన్ సంకీర్ణ సేనల దాడులు, గస్తీలకు హూతీ తిరుగుబాటుదారులు ఏమాత్రం బెదరడం లేదు. గత వారం ఓ నౌకపై దాడులు చేసిన హూతీలు తాజాగా ఎర్రసముద్రంలో అమెరికాకు చెందినU.S M.Q-9 డ్రోన్ను క్షిపణులతో కూల్చివేశారు. యెమెన్లోని హొడెయిడా తీరం నుంచి రాత్రి వేళ జరిపిన ఈ దాడి దృశ్యాలను హూతీ రెబెల్స్ విడుదల చేశారు.ఇందులో ఓ క్షిపణి హూతీలు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని కూల్చుతున్నట్టు కనిపిస్తోంది.
హూతీ రెబెల్స్ విడుదల చేసిన దృశ్యాల్లో డ్రోన్ శిథిలాలనుకొందరు తీరం వైపు లాక్కొని వస్తున్నట్టు ఉంది. అందులో డ్రోన్కు చెందిన విద్యుత్ పరికరాలు శకలాలు ఉన్నాయి. మిలియన్ల డాలర్ల విలువ చేసే ఈ తరహా డ్రోన్ను గతంలోనూ హూతీలు కూల్చివేశారు. ఆ సమయంలో దాడిని అమెరికా ధ్రువీకరించింది. అయితే.. ప్రస్తుత డ్రోన్ దాడికి సంబంధించి అగ్రరాజ్యం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఒకవైపు గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంటే దీనికి ప్రతీకారంగా హూతీలు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. ఇవి ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com