అఫ్గానిస్థాన్ తాలిబన్ల ఘర్షణలో ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ మృతి

Danish Siddiqui
Danish Siddiqui: ప్రముఖ ఫోటో జర్నలిస్ట్, పులిట్జర్ అవార్డ్ గ్రహీత డానిష్ సిద్దిఖీ ఆకస్మికమరణంపై.. దేశ వ్యాప్తంగా జర్నలిస్టులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అదృష్టవశాత్తూ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానంటూ ట్వీట్ చేసిన మూడురోజుల్లోనే కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని రేపింది. అఫ్గానిస్థాన్ కాందహార్లోని స్పిన్ బొల్డాక్ సరిహద్దు ప్రాంతాన్ని తాలిబన్లు ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో అఫ్గాన్సైన్యానికి తాలిబన్లకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. రాయిటర్స్ సంస్థలో పని చేస్తున్న డానిశ్ ఘటనలు కవర్ చేస్తున్న సమయంలో మృతి చెందారు. సిద్దిఖీ మృతి చెందినట్లు ఆఫ్ఘనిస్తాన్ భారతదేశ రాయబారి తెలిపారు. సిద్ధిఖి మరణం తీవ్ర విచారకరమని రాయబారి ఫరీద్ మముండ్జాయ్ ప్రకటించారు.
టెలివిజన్ న్యూస్ కరస్పాండెంట్గా కెరియర్ ను ప్రారంభించిన డానిష్ సిద్దిఖీ.. తరువాత ఫోటో జర్నలిస్టుగా మారారు. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఫోటో జర్నలిస్ట్గా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సంక్షోభ సమయాలను అతి సాహసోపేతంగా కవర్ చేసిన ఘనత సిద్ధిఖీ సొంతం. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లలో యుద్ధాలు, రోహింగ్యా శరణార్థుల సంక్షోభం, నేపాల్ భూకంపాలు, హాంకాంగ్ నిరసనలు మొదలైనవాటిని కవర్ చేశారు. శ్రీలంక పేలుళ్ల సమయంలో పోలీసు కేసును కూడా సిద్దిఖీ ఎదుర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com